ఢిల్లీలో ఫలితాలు ఐదారు గంటలు ఆలస్యం.. కారణమేంటంటే..
సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపై పడింది. మే 23న ఓట్ల లెక్కింపు కోసం ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈసారి ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు ఐదారు గంటలు ఆలస్యంగా వెలువడతాయని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సి ఉండటమే అందుకు కారణమని చెప్పింది.
ఎగ్జిట్పోల్స్ ఉత్సాహాం... మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ వ్యూహం
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో 5 చొప్పున వీవీప్యాట్ మెషీన్ల స్లిప్పులు లెక్కించాల్సి ఉంది. ఈవీఎంల లెక్కింపు అనంతరం ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ లెక్కన ఢిల్లీలో మొత్తం 350 వీవీప్యాట్ మెషీన్లలో ఉన్న స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది.
ఢిల్లీలో ఓట్ల లెక్కింపు కోసం ప్రతి లోక్సభ నియోజకవర్గంలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి పది అసెంబ్లీ సెగ్మెంట్లకు కలిసి ఒక కౌంటింగ్ హాల్లో ఓట్లు లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం ప్రతి హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 14 ఈవీఎంల రిజల్ట్స్ను ఒక్కో రౌండ్గా పరిగణిస్తారు. చివరి రెండు రౌండ్ల ఈవీఎంలు మిగిలి ఉండగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఈవీఎంల ఫలితాలు వెలువడిన అనంతరం వీవీ ప్యాట్ మెషీన్లలోని స్లిప్పులను లెక్కించి అధికారికంగా ఫలితాలు వెల్లడించనున్నారు.