ఢిల్లీ అల్లర్లపై 123 కేసులు.. 630 మంది అరెస్టు.. ఒక్కో కుటుంబానికి రూ.25వేల తక్షణ నగదు పరిహారం
దేశరాజధానిలో సిక్కుల ఊచకోత తర్వాత అత్యంత హేయమైన హింసగా పరిగణిస్తోన్న తాజా అల్లర్లకు సంబంధించి చట్టం తన పనిని ఉధృతం చేసింది. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్ పూర్; చాంద్ బాగ్, ఖురేజీ ఖాస్, భజన్ పూర్ తదితర ప్రాంతాల్లో మూక హత్యలు, దాడులు, ఆస్తుల ధ్వంసం, బెదిరింపులకు సంబంధించి భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు బాధిత కుటుంబాలకు సాయంగా స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగగా, ఢిల్లీ సర్కారు సైతం భారీ పరిహారాన్ని సిద్ధం చేస్తున్నది.

ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన..
ఈశాన్య ఢిల్లీలో ఆదివారం నుంచి బుధవారం దాకా చోటుచేసుకున్న అల్లర్లలో రెండు మతాలకు చెందిన 42 మంది హత్యకు గురయ్యారు. తీవ్రగాయాలతో మరో 250 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో మరణాల సంఖ్య రోజురోజకూ పెరుగుతున్నది. హింసాత్మక ఘటనలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం వరకు మొత్తం 123 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని, 630 మంది నిందితులు లేదా అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని ఢిల్లీ పోలీసు శాఖ అధికారిక ప్రతినిధి మన్ దీప్ సింగ్ రంధావా ప్రకటించారు.

ఒక్క కుంటుంబానికి తక్షణం రూ.25వేలు
అల్లర్ల కారణంగా ఈశాన్య ఢిల్లీలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఢిల్లీ సర్కారు.. ఆ మేరకు పరిహారం ప్యాకేజీని సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు ధ్వంసమైపోవడంతో తిండి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఢిల్లీ సర్కారు ఆహారాన్ని సరఫరా చేస్తున్నది. ఒక్కో బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా శనివారం మధ్యాహ్నం రూ.25వేల నగదు అందజేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతోపాటు దుకాణాలు, ఇళ్ల పునరుద్ధరణ కోసం కూడా భారీ మొత్తాన్ని వెచ్చించాలని ఆప్ సర్కారు భావిస్తున్నది.

వెల్లివిరిసిన మానవత్వం
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నేపథ్యంలో చెలరేగిన మత కలహాల కారణంగా ఈశాన్య ఢిల్లీ దారుణంగా ధ్వంసమైంది. సాధారణ ప్రజలందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. అల్లర్లు తగ్గుముఖం పట్టిన వెంటనే.. బాధితుల్లో వ్యవస్థ పట్ల మళ్లీ నమ్మకాన్ని పెంపొందించేలా.. వందలాది స్వచ్ఛంద సంస్థలు, వేలాది మంది ప్రైవేటు వ్యక్తులు ఈశాన్య ఢిల్లీలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ సర్కారు సైతం తన వంతు సాయంగా పరిహారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications