డెత్ వారెంట్ జారీలో జాప్యం: విచారణ జనవరి 7కు వాయిదా: మా కడుపుకోత పట్టదా: నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన నలుగురికీ ఉరిశిక్షను విధించడంలో మరింత జాప్యం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన కుమార్తెపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన నలుగురు కామాంధులను వెంటనే ఉరి తీయాలంటూ నిర్భయ తల్లి ఆశాదేవి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణను వాయిదా వేసింది ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం. ఈ పిటీషన్ పై తదుపరి విచారణ వచ్చే నెల 7వ తేదీకి వాయిదా పడింది.
నిర్భయ దోషికి ఉరి తీయక తప్పదు: ఆ శిక్షకు అర్హుడే: రివ్యూ పిటీషన్ తోసిపుచ్చిన సుప్రీం
నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుని డిసెంబర్ 16వ తేదీ నాటికి ఏడేళ్లు పూర్తయింది. ఈ కేసులో దోషులుగా తేలిన అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్, వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తాలకు ఉరి శిక్ష విధిస్తూ 2017లో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత కూడా జాప్యం ఏర్పడటంతో నిర్భయ తల్లి ఆశాదేవి.. తనకు న్యాయం చేయాలని కోరుతూ పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు.
నిర్భయ దోషులకు వెంటనే ఉరిశిక్షను అమలు చేసేలా డెత్ వారెంట్ ను జారీ చేయాలని ఆశాదేవి విజ్ఞప్తి చేశారు. పటియాలా హౌస్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ సతీష్ అరోరా.. దీనిపై విచారణ చేపట్టారు. ఆ సందర్భంగా తీహార్ కేంద్ర కారాగారం అధికారులకు ఆయన నోటీసులను జారీ చేశారు. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ కు రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరే అవకాశం కల్పించిన నేపథ్యంలో.. అతని వైఖరేమిటనేది వెల్లడించాలని న్యాయమూర్తి సతీష్ అరోరా.. ఈ నోటీసుల్లో ఆదేశించారు.
అనంతరం పిటీషన్ విచారణను వచ్చేనెల 7వ తేదీకి వాయిదా వేశారు. సతీష్ అరోరా.. ఈ కేసును వాయిదా వేసిన వెంటనే.. అక్కడే ఉన్న ఆశాదేవి కన్నీరు పెట్టుకున్నారు. విలపించారు. న్యాయస్థానాలన్నీ దోషుల వైపు మొగ్గు చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న ఉదంతం చోటు చేసుకుని ఏడేళ్లు గడిచిపోయిందని, ఇప్పటికి కూడా దోషులు బతికే ఉన్నారని అన్నారు. న్యాయస్థానాలేవీ తమ బాధను, ఆవేదనను, కడుపుకోతను న్యాయస్థానాలు పట్టించుకోవట్లేదని భోరుమన్నారు.