షాక్: మద్యం మత్తులో చెవి కొరికి తిన్నాడు, పోలీసుల అరెస్ట్
న్యూఢిల్లీ: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేశారు. అంతేకాదు అతడి చెవిని కొరికి నమిలి మింగాడు ఓ వ్యక్తి. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకుసమాచారం ఇచ్చారు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
న్యూఢిల్లీలోని సుల్తాన్పురిలో నివాసం ఉంటున్న కుమార్ ఇంటి వద్దకు సంతోష్, దీపక్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం రాత్రి పూట వచ్చారు. అప్పటికే వారిద్దరూ కూడ తప్పతాగారు. కుమార్ ఇంటికి వచ్చి కుమార్ ను పిలిచి బండ బూతులు తిట్టారు.
అయితే కుమార్ వారిద్దరిని తొలుత బతిమిలాడాడు. గొడవ చేయకుండా వెళ్ళిపోవాలని కోరాడు. అయితే అవేమీ వారు పట్టించుకోలేదు. కుమార్ ను తిట్టడమే కాదు ఆయనపై దాడికి కూడ పాల్పడ్డారు.
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కుమార్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడితో కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు తనను రక్షించాలని కోరుతూ కుమార్ కేకలు వేశాడు.
ఈ తరుణంలో కుమార్ కేకలు విన్న స్థానికులు నిద్ర లేచి బయటకు వచ్చారు. అ సమయంలోపునే ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి కుమార్ చెవిని కొరికి నమిలి మింగేశాడు. దీంతో కుమార్ చెవి నుండి తీవ్ర రక్తస్రావమైంది.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుమార్ ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కుమార్ తో ఆ ఇద్దరు వ్యక్తులు ఎందుకు గొడవకు దిగారనే విషయమై స్పష్టత లేదు.
ఈ ముగ్గురికి మధ్య గతంలో కూడ ఎలాంటి గొడవలు లేవని స్థానికులు చెప్పారు. అంతేకాదు పోలీసులు కూడ ఈ విషయమై విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.