కిడ్నాప్: ఢిల్లీ వర్సిటీ విద్యార్థినిపై ఘజియాబాద్లో రేప్
ఘజియాబాద్: ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిని కిడ్నాప్ చేసిన ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లోని కవినగర్లో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బికాం చదువుతున్న సదరు విద్యార్థిని డిగ్రీ ఫలితాలు విడుదల కావడంతో సైబర్ కేఫ్కు వెళ్లి ఫలితాలను చూసుకుంది. ఆ తర్వాత ఇంటికి తిరుగుపయనమైన సమయంలో ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. సదరు యువతిని సచిన్, లలిత్ అనే ఇద్దరు యువకులు కవినగర్లోని రాజాపూర్ ప్రాంతంలో వారింటికి తీసుకెళ్లారు. అక్కడే లలిత్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారు.
కాగా, ఇంటికి చేరుకున్న బాధిత యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు లలిత్ను అరెస్ట్ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న సచిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.