ఢిల్లీ అల్లర్లు : పారామిలటరీపై యాసిడ్ దాడి.. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చారా..?
ఢిల్లీలో హింసాత్మక ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం అదనపు బలగాలను మోహరించింది.అయితే ఆందోళనకారులు పోలీసులు,పారామిలటరీ బలగాలపై దాడులు చేస్తుండటం సమస్యను మరింత జటిలం చేస్తోంది. తాజాగా నార్త్ ఢిల్లీలోని కరవాల్ నగర్లో పారామిలటరీ బలగాలపై కొంతమంది ఆందోళనకారులు యాసిడ్ లాంటి కెమికల్తో దాడి చేశారు. గాయపడ్డ పారామిలటరీ జవాన్లను చికిత్స కోసం జీటీబీ ఆసుపత్రికి తరలించారు.

పారామిలటరీపై యాసిడ్ దాడి.. 13కి పెరిగిన మృతుల సంఖ్య
హింసాత్మక ఘటనలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం అదనపు బలగాలను నార్త్ ఢిల్లీలో మోహరించింది. ఇందులో భాగంగా కొంతమంది పారామిలటరీ బలగాలు కరవాల్ నగర్లో ఆందోళనకారులను చెదరగొడుతుండగా.. కొంతమంది ఆందోళనకారులు ఇళ్ల టెర్రస్లపై నుంచి యాసిడ్తో దాడి చేశారు. హుటాహుటిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు.ఢిల్లీ అల్లర్లలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 13కి చేరగా.. 150 మంది గాయపడ్డారు. ఇక జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ వద్ద సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు.
షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వలేదన్న ఢిల్లీ పోలీస్..
ఢిల్లీలో పరిస్థితి అదుపు తప్పుతుండటంతో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసినట్టు కొన్ని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాసేపటికే ఢిల్లీ పోలీసులు దీనిపై స్పందించారు. ఇప్పటివరకు అలాంటి ఆదేశాలేవీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపు చేసేందుకు హోం మంత్రిత్వ శాఖ వద్ద తగినంత ఫోర్స్ లేదని ఒక అధికారి వెల్లడించినట్టుగా వచ్చిన వార్తలను ఢిల్లీ సీపీ అమూల్య నాయక్ ఖండించారు. అది తప్పుడు సమాచారం అని కొట్టిపారేశారు.

సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
ఢిల్లీలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆయా ప్రాంతాల పరిధిలో జరగాల్సిన సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విజ్ఞప్తి తర్వాత సీబీఎస్ఈ బోర్డు దీనిపై అధికారిక ప్రకటన చేసింది. నార్త్ ఢిల్లీ పరిధిలో 10,11,12 తరగతుల సీబీఎస్ఈ పరీక్షలను బోర్డు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
Recommended Video


ఢిల్లీ అల్లర్లు కలచివేస్తున్నాయన్న మమతా..
ఢిల్లీలో నెలకొన్న పరిణామాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జరుగుతున్న ఘటనలు తమను తీవ్రంగా కలచివేస్తున్నాయని చెప్పారు. పరిస్థితులను తాము గమనిస్తున్నామని.. దేశంలో హింసకు తావు లేదని చెప్పారు. భారత దేశ ప్రజలుగా మనందరం శాంతిని కోరుకుంటున్నామని,ప్రతీ ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications