డీలిమిటేషన్ బిల్లు పై కేంద్రం బిగ్ ప్లాన్, లెక్క పక్కా- ముహూర్తం ఫిక్స్..!!
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మోదీ 4.0 లక్ష్యంగా కీలక అడుగులు పడుతున్నాయి. కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ.. విపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంలోని ముఖ్య నేతలు కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. మరోసారి బిల్లు ప్రవేశ పెట్టటం ఆమోదం కోసం కసరత్తు జరుగుతోంది. ఇందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది.
కేంద్రం మరోసారి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశం పైన కీలక మంత్రాంగం సాగిస్తోంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవడం (ప్రోరోగ్ చేయకపోవడం) వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. డీలిమిటేషన్పై ప్రభుత్వానికి ఉన్న ప్రణాళిలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్లపాటు లోక్సభ సీట్లను పెంచవద్దని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.

తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీలలో జరిగిన వరుస ఫిరాయింపుల నేపథ్యంలో, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలని భావించినా.. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంతో వెనక్కి తగ్గారు. ప్రస్తుతం తిరిగి ఈ బిల్లు ఆమోదం కోసం పూర్తి మెజారిటీని సాధించేందుకు పావులు కదుపుతోంది. ఇందు కోసం దాదాపు ముహూర్తం సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ బలోపతం లక్ష్యంగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు సిద్దం అవుతున్నారు. దీనికి ముందే సెప్టెంబర్ 8,9 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం వ్యూహాలను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏప్రిల్లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ రాక వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను మళ్లీ ఇదే సెషన్లో ముందుకు తెస్తారనే ప్రచారం జరుగుతోంది.
ఆప్, టీఎంసీ, శివసేన నుంచి చీలిక వర్గాల ఎంపీలతో పాటుగా డీఎంకే, ఎన్సీపీ పైనా బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే కావాల్సిన మెజార్టీ లెక్క పక్కా చేసుకున్న తరువాత ప్రత్యేక సమావేశాలకు సమాయత్తం అవుతున్నారని సమాచారం. దీంతో.. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సెప్టెంబర్ తొలి వారంలోనే పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. విపక్షాలు ఏం చేస్తాయనేది ఆసక్తిగా మారుతోంది.














Click it and Unblock the Notifications