సీమాంధ్ర రాజధానిగా ఈ ఐదు ప్రాంతాలు: జైరాం రమేష్
హైదరాబాద్: తాను సీమాంధ్ర ప్రాంత పార్లమెంటు సభ్యుడిగానే కొనసాగుతానని, విభజన తర్వాత సీమాంధ్రలో రాజధాని కోసం పలు నివేదికలు వచ్చాయని కేంద్రమంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యులు జైరామ్ రమేష్ గురువారం హైదరాబాదులో అన్నారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాము సీమాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. చారిత్రక, రాజకీయ కారణాలతో విడదీసినా తెలుగు వారంతా ఒక్కటే అన్నారు. సీమాంధ్రకు ఆరుసూత్రాల పథకం ప్రకటించినట్లు చెప్పారు. ప్రత్యేక హోదాతో సీమాంధ్రకు 90 శాతం నిధులు కేంద్రం ఇస్తుందని చెప్పారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందన్నారు.
పోలవరంను బహుళార్ధక సాధక ప్రాజెక్టుగా కేంద్రం పూర్తి చేస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో 371డి కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రస్థాయి ఉద్యోగులకు ఆప్షన్స్ ఉంటాయన్నారు. అపాయింటెడ్ డే ప్రకటించడానికి భారీగా కసరత్తు జరగాల్సి ఉందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుకు మూడు నెలలు పట్టిందని గుర్తు చేశారు.
తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, ఒంగోలు తదితర పట్టణాలను రాజధానిగా చేయాలని నివేదికలు వస్తున్నాయని, నిపుణుల కమిటీ దానిని పరిశీలిస్తుందని చెప్పారు. కాకినాడ, రాజమండ్రిలలో స్పెషల్ రిఫైనరీలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ఆందోళనలు మాని, అభివృద్ధి గురించి ఆలోచించాలని సూచించారు.
తెలంగాణ డిమాండ్ అరవయ్యేళ్ల నుండి ఉందన్నారు. బిజెపి సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు ప్రధానమంత్రిని కలిశారని కానీ, సీమాంధ్రకు ఏం కావాలో కోరలేదన్నారు. బిజెపిది ద్వంద్వవైఖరి అన్నారు. తమ పార్టీ ఎంపీలు ప్రధానిని, సోనియాను, రాహుల్ గాంధీలను కలిసి ప్రత్యేక ప్రతిపత్తి కోరారని, ఆ తర్వాతనే తెలంగాణ బిల్లు లోకసభకు వచ్చిందన్నారు.
సీమాంధ్రకు ఆరు సూత్రాల పథకం అమలు చేస్తామని ప్రధాని ప్రకటించారని తెలిపారు. ఐదేళ్లలో సీమాంధ్రకు కేంద్రం నుండి యాభైవేల కోట్ల రూపాయలు వస్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తొంబై శాతం నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 84వేల మంది ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. సీమాంధ్రకు ఐఐటి, ఎయిమ్స్, సూపర్ స్పెషల్ ఆసుపత్రులు తదితరాలు వస్తాయన్నారు.
విభజనపై అసెంబ్లీ అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటుందని, నిర్ణయాలు తీసుకోదని, ఇది రాజ్యాంగంలో ఉందన్నారు. ప్రస్తుత ప్రకారమే తెలంగాణలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సీమాంధ్రుల సమస్యలను తాము పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడున్న ప్రాజెక్టులు యథాతథంగా ఉంటాయని, ఒకే జాతికి రెండు రాష్ట్రాలు ఉంటాయని చెప్పారు. తెలంగాణపై పార్టీలు నిలువునా చీలిపోయాయని, సీమాంధ్రలో సమైక్యం, తెలంగాణలో రాష్ట్రం కోసం ఉద్యమించారన్నారు.
తెలంగాణ విషయంలో కోర్టుకు వెళ్లినా ఇబ్బందులు ఏమీ ఉండవన్నారు. విభజన విషయంలో ఇరు ప్రాంతాలకు ఎందుకు చేస్తున్నామో చెప్పడంలో విఫలమయ్యామన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు డిపిఆర్ హోదా లేదని, అందుకే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించలేకపోయామన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీకి ఎన్నికలు పెను సవాలే అన్నారు. బిల్లులో పెట్టిన అంశాల అమలుకు ఇబ్బందులు అన్నారు.
కిరణ్, చంద్రబాబులపై....
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారని జైరామ్ రమేష్ చెప్పారు. కిరణ్ పార్టీ పెడతానంటే బెస్టాఫ్ లక్కు చెప్పడం మినహా మరేమీ చేయలేనన్నారు. ఎన్డీసికి ఇద్దరు ముఖ్యమంత్రులు వస్తారని, ఇప్పటి వరకు హిందీ భాష మినహా మరే భాషకు ఇద్దరు సిఎంలు లేరన్నారు. ఇద్దరు సిఎంలు సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి మాట మార్చారన్నారు.