పెద్దనోట్లు రద్దు, 1.5 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి, సోషల్ మీడియాలో కేంద్రంపై ఫైర్ !
2016 నవంబర్ 8వ తేదీన పెద్దనోట్లు రద్దు చెయ్యడంతో దేశం మీద పిడుగు పడింది. ఏడాది పూర్తి అయినా ప్రజలకు పెద్దనోట్ల రద్దు ప్రభావం వదిలిపెట్టడం లేదు.
న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీన పెద్దనోట్లు రద్దు చెయ్యడంతో దేశం మీద పిడుగు పడింది. ఏడాది పూర్తి అయినా ప్రజలకు పెద్దనోట్ల రద్దు ప్రభావం వదిలిపెట్టడం లేదు. డిమానిటైజేషన్ దెబ్బ పడని రంగం అంటూ ఏదీ లేదు అని చెప్పడం సాధ్యం కాదంటున్నారు పలువురు వ్యాపారులు, ప్రజలు.
నిరుద్యోగులు ప్రభుత్వాలకు సవాలుగా మారారు. దినసరి కార్మికులు ఇప్పటికీ రోడ్ల మీద తిరుగుతున్నారు. దేశంలో ఉపాది మార్గాలు తగ్గుముఖం పడుతున్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. సర్వేల ప్రకారం 2017 జనవరి నుంచి ఏఫ్రిల్ వరకూ ఉద్యోగాలు, ఉపాది మార్గాలు మందగించాయి.

1.52 లక్షల ఉద్యోగాలు ఊడిపోయాయి !
లేబర్ బ్యూరో క్వాటర్లీ ఎంప్లాయిస్ మెంట్ సర్వే అంచనా ప్రకారం 2016 అక్టోబర్- డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో 1.52 లక్షల క్యాజువల్ ఉద్యోగాలు, 46 వేల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో కోత పడింది. ఇంకా వెలుగులోకి రాని ఉద్యోగాలు ఎన్ని ఊడిపోయాయో ఆదేవుడికే తెలియాలి అంటున్నారు నిరుద్యోగులు.

107 ప్రముఖ సంస్థల్లో !
అనేక సర్వేల ప్రకారం దేశంలోని 107 ప్రముఖ సంస్థలు 14, 668 మంది ఉద్యోగులను తొలగించారని వెలుగు చూసింది. వేరే కంపెనీల్లో ఉద్యోగాలు రాక కొన్ని వేల మంది అనేక నెలల పాటు రోడ్డున పడ్డారని, వారి కుటుంబ సభ్యలు ఆకలితో అలమటించారని సర్వేలు చెబుతున్నాయి.

ప్రధాన మంత్రి స్కీమ్ కే దిక్కులేదు !
మోడీ ప్రతిష్ట్మాతకంగా తీసుకున్న పెద్దనోట్ల రద్దు ప్రభావం కేంద్ర ప్రభుత్వ పథకాల మీద పడిందని స్పష్టంగా కనపడుతోంది. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పీఎంకేవీవై) స్కీమ్ కింద 2017 జులై మొదటి వారంలో దేశం మొత్తం 30.67 లక్షల మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే అందులో ఇప్పటి వరకూ కేవలం 2.9 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన వారు రోడ్ల మీద తిరుగుతున్నారు.

150 మంది ప్రాణాలు తీశారు !
పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో 150 మందికి పైగా ప్రాణాలు తీసుకున్నారని, వారి ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి మోడీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ లో ప్రశ్నించారు. పెద్దనోట్లు రద్దు కారణంగా వారి కుటుంబాలను పోషించుకోలేని అమాయకులు బలి అయ్యారని ఫిరోజ్ ఖాన్ కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.

ప్రజలు మూర్ఖులా ?
ప్రధాన మంత్రి మోడీ ప్రజలు అందరూ మూర్ఖులు అనుకుంటున్నారా అంటూ కీర్తీ అనే యువతి ట్విట్ చేసింది. పెద్దనోట్లు రద్దు కారణంగా జీడీపీ 5.7 శాతం పడిపోయిందని కీర్తి ఆరోపించింది. పెద్దనోట్ల రద్దు విషయంలో సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications