క్యాష్లెస్ - మరో షాకింగ్!: ఏటీఎం, బ్యాంకుల నుంచి తీసుకుంటే..
నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. సాధ్యమైనంత మేర క్యాష్ లెస్ కంట్రీగా చేయాలని మోడీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో కొత్త ఆలోచనలు చేశారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. సాధ్యమైనంత మేర క్యాష్ లెస్ కంట్రీగా చేయాలని మోడీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నో కొత్త ఆలోచనలు చేశారు.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇక నుంచి బ్యాంకు, ఏటీఎం నుంచి తీసుకునే నగదు పైన సర్చార్జీ విధించాలని కేంద్రం భావిస్తోంది. అందుకు పరిమితి విధించనుంది. ఏటీఎంల నుంచి రోజుకు రూ.15వేలు తీసుకోవచ్చు. బ్యాంకుల నుంచి రూ.50వేలు తీసుకోవచ్చు.
ఈ పరిమితి దాటితే 0.5 శాతం నుంచి 2 శాతం మేర వడ్డింపు ఉండొచ్చు. ఈ నెల 30వ తేదీ తర్వాత నుంచి దీనిని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. నిర్వహణ వ్యయం పేరుతో దీనిని వసూలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
డిసెంబరు 30వ తేదీ తర్వాత ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500, బ్యాంకు నుంచి వారానికి రూ.24,000 తీసుకోవచ్చన్న నిబంధన ముగియనుంది. ప్రజలు మునుపటి మాదిరిగానే నగదు ద్వారా లావాదేవీలు జరపడానికి ఉత్సాహం చూపే అవకాశముంది.
అయితే బ్యాంకుల వద్ద తగినంతగా నగదు నిల్వలు లేవు. ఫిబ్రవరి చివరినాటికిగానీ రిజర్వు బ్యాంకు అవసరమైన నగదును పంపించే అవకాశం లేదు.
కాబట్టి నల్లధనాన్ని అదుపు చేయడంపై జస్టిస్ ఎంబి షా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటయిన సర్ఛార్జి విధింపును పరిశీలిస్తున్నారని చెబుతున్నారు. ఈ నిబంధనను దాదాపు ఆరు నెలల పాటు అమలు చేయాలని ప్రస్తుతం భావిస్తున్నారని సమాచారం. అయితే ఈ నిబంధన ఎప్పటికీ అలాగే ఉంచే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.
అలాగే, రూ.3 లక్షలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో జరపడాన్ని నిషేధించే అవకాశాలను పరిశీలిస్తోంది. ప్రతి కుటుంబం రూ.15 లక్షలకు మించి నగదు ఉంచుకోవడాన్ని నిషేధించడాన్ని కూడా పరిశీలిస్తోంది.