నోట్ల రద్దు ఎన్నికల అంశం కాదు.. యూపీలో గెలుపు మాదే : రాజ్ నాథ్ సింగ్
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం లక్నోలో పరివర్తన్ ర్యాలీలి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు.
ఉత్తరప్రదేశ్ లో మార్పునకు బీజేపీ పరివర్తన్ ర్యాలీ పునాదులు వేసిందని, మార్పు అనివార్యమని ఆ రాష్ట్ర ప్రజలు సైతం బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. నోట్ల రద్దు అంశంపై మాట్లాడుతూ.. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎన్నికల అంశంగా చూడరాదని అభిప్రాయపడ్డారు.
"జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడం జరిగింది.. అందువల్ల ఎన్నికలతో నోట్ల రాద్దుకు ఏమాత్రం సంబంధం లేదు.. ఎన్నికల్లో విజయం, పరాజయంతో దీనిని ముడుపెట్టరాదు.." అని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
అవినీతి, నల్లదనం నిర్మూలన, దేశ ఆర్థిక పటిష్టత కోసమే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయం ఉగ్రవాదంపై పోరాడేందుకు కూడా ఉపకరించిందని వివరించారు.