కర్ణాటక చరిత్రలోనే లేదు: అసెంబ్లీలో 200 మంది మార్షల్స్, తోక తిప్పితే సినిమా చూపిస్తారు!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప బలపరీక్ష నిరూపించుకుంటున్న సందర్బంలో కర్ణాటక చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 200 మందికి పైగా మార్షల్స్ ను అసెంబ్లీలో మొహరించారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ శాసన సభ్యుల మధ్య ఎలాంటి గొడవలు, ఆందోళనలు జరగకుండా చూడటానికి అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఆందోళన చేసి గందరగోళం సృష్టించాలని తోక తిప్పితే సినిమా చూపించడానికి రంగం సిద్దం చేశారు. 221 మంది ఎమ్మెల్యేలకు అంతే సంఖ్యలో మార్షల్స్ ను రంగంలోకి దింపి జాగ్రత్తలు తీసుకున్నారు.
మెజారిటీ ఎమ్మెల్యేలు
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నాయకులు మాకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నారు. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ సందర్బంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ సందర్బంగా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు 200 మందికి పైగా మార్షల్స్ ను రంగంలోకి దింపారు.
సీఎం యడ్యూరప్ప
ముఖ్యమంత్రిగా ఈనెల 17వ తేదీ ప్రమాణస్వీకారం చేసిన బీఎస్. యడ్యూరప్ప 15 రోజుల్లో తన మెజారిటీ శాసన సభ్యులను అసెంబ్లీలో నిరూపించుకుంటానని చెప్పారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
సుప్రీం కోర్టు ఆదేశం
బలపరీక్షలో మెజారిటీ శాసన సభ్యులను నిరూపించుకోవడానికి 15 రోజులు అవకాశం ఇవ్వడం కుదరదని శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్షలో సీఎం మెజారిటీ శాసన సభ్యులను నిరూపించుకోవాలని శుక్రవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యేలకు భద్రత
కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని కర్ణాటక డీజీపీకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలకు కర్ణాటక పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
విదాన సౌధ పరిసరాల్లో 144 సెక్షన్
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప బలపరీక్షలో మెజారిటీ శాసన సభ్యుల మద్దతు కూడగట్టుకుంటున్న సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విదాన సౌధ పరిసర ప్రాంతాల్లోని కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ విదించారు.