జయలలిత నియోజ వర్గంలో ఈసీ రికార్డు: దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారి !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. దేశ ఎన్నికల చరిత్రలో ఓ శాసన సభ నియోజక వర్గం ఎన్నికల కోసం ఐదుగురు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించడం ఇదే తొలిసారి.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా భారీ మొత్తంలో నగదు పంపిణి చేస్తున్నారని డీఎంకే, సీపీఎం తదితర పార్టీలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకు ముగ్గురు పరిశీలకులను నియమించారు.

ఫిర్యాదుల రావడంతో ఢిల్లీలో ప్రత్యేక సమావేశం
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణి చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ఢిల్లీలో డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్ ఉమేష్ సిన్హా అధ్యక్షతన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. ఆర్ కే నగర్ ఎన్నికల పరిశీలకులుగా ఐదు మంది ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు.

ఇక ఆటలు సాగవు, ఈ అధికారులు మోనార్కులు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పర్యవేక్షకుడుగా ప్రవీణ్ ప్రకాష్, పోలీసు శాఖ తరపున పర్యవేక్షకుడుగా శివకుమార్ వర్మ, అభ్యర్థుల ఖర్చుల పరిశీలకులుగా అపర్ణ విల్లూరి నియమితులయ్యారు. వీరు కాకుండా మల్లికార్జున్ ఉత్తురే, సమీర్ టెక్రీ వాల్ అనే ఇద్దరు సీనియర్ అధికారులను ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పరిశీలకులుగా నియమించారు.

చెన్నై చేరుకున్న ప్రత్యేక అధికారి
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ఎనిమిది ప్రధాన పార్టీల నడుమ పోటీ జరుగుతున్న సందర్బంగా విచ్చలవిడిగా డబ్బు పంపిణి చెయ్యకుండా అడ్డుకోవడానికి ఢిల్లీలోని డిప్యూటీ ఎన్నికల కమీషనర్ ఉమేష్ సిన్హా స్వయంగా చెన్నై చేరుకుని ఆర్ కే నగర్ నియోజక వర్గంలో పర్యటిస్తున్నారు.

ఐఏఎస్, ఐపీఎస్, ఐటీ శాఖ అధికారులు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల పర్యవేక్షణకు ఇద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించారు. ఉప ఎన్నికలను పరిశీలించేందుకు 12 మంది ఆదాయ పన్ను శాఖ అధికారులను ఈసీ రంగంలోకి దింపింది.

భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లు
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా 256 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. భద్రత కోసం తమిళనాడు పోలీసులతో సహ కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. 256 పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 25 ఫ్లయింగ్ స్కాండ్ లను ఏర్పాటు చేశారు.

ఎవరి ధీమా వారిదే
ఆర్ కే నగర్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పలు పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. పన్నీర్ సెల్వం, శశికళ వర్గం నాయకులు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ స్టాలిన్, డీఎండీకే పార్టీ విజయక్ కాంత్ వర్గం, బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ తదితరులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు.

అందుకే కేంద్ర బలగాలు
అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారని ఇప్పటికే డీఎంకే పార్టీ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. డీఎంకే పార్టీ దెబ్బతో చెన్నై నగర పోలీసు కమిషనర్ జార్జ్ ను ఈసీ బదిలి చేసింది. ఇప్పుడు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ఆర్ కే నగర్ నియోజక వర్గంలో మోహరించనున్నాయి.












Click it and Unblock the Notifications