హత్య కేసులో డేరా చీఫ్ డేరా బాబాకు జీవిత ఖైదు, మరో నలుగురికి కూడా: భారీ జరిమానా
ఛండీగఢ్: డేరా సచ్ఛా సౌధా అధినేత, వివాదాస్పద మత గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(డేరా బాబా)కే జీవిత ఖైదు పడింది. 2002లో హత్యకు గురైన డేరా సౌధా మేనేజర్ రంజిత్ సింగ్ కేసులో డేరా బాబా పాత్ర ఉన్నట్లు హర్యానాలోని పంచకులలోని సీబీఐ న్యాయస్థానం ఇది వరకే తేల్చింది.
డేరా బాబాతోపాటు మరో నలుగురికి కూడా ఈ హత్య కేసులో హస్తం ఉన్నట్లు నిర్ధారించిన కోర్టు.. సోమవారం వీరికి శిక్షను ఖరారు చేసింది. డేరా బాబాతో ఈ నలుగురికి కూడా జీవిత ఖైదు విధించింది. ఈ శిక్షలో భాగంగా కోర్టు దోషులకు జరిమానా కూడా విదించింది.
డేరా బాబా రూ. 31 లక్షలు చెల్లించాల్సి ఉంది. మిగితా నలుగురు లక్షన్నర నుంచి రూ. 75 వేల వరకు జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ మొత్తంలో కొంత భాగం రంజిత్ సింగ్ కుటుంబానికి వెళ్లనుంది. మరోవైపు, ఈ హత్య కేసులో సంబంధం ఉన్న ఆరో నిందితుడు ఇదివరకే ప్రాణాలు కోల్పోయాడు. డేరా బాబా ఓ అత్యాచార కేసులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తున్నాడు.
కాగా, డేరా బాబాకు అనుచరుడిగా ఉన్న రంజిత్ సింగ్ 2002లో హత్యకు గురయ్యాడు. డేరా ఆశ్రమంలో మహిళలపై జరుగుతోన్న లైంగిక వేధింపులను పేర్కొంటూ విడుదలైన ఓ లేఖ అప్పట్లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, అది ఆశ్రమ మేనేజర్గా ఉన్న రంజిత్ సింగ్ రాసినట్లు డేరా బాబా అనుమానించాడు. ఈ క్రమంలోనే ఆయనను హత్య చేసేందుకు డేరా బాబా కుట్ర పన్నినట్లు సీబీఐ ఛార్జీషీటు నమోదు చేసింది. ఆ హత్య కేసులో భాగస్తులైన వారిని ఇటీవల దోషులుగా తేల్చిన కోర్టు సోమవారం శిక్షను ఖరారు చేసింది.