గుర్మీత్ కోసం అక్కడికి లక్షల మంది!: హైకోర్టు సీరియస్, రెచ్చకొడితే కఠినంగానే..
డేరా స్వచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. కాసేపట్లో ఆయన పంచ్కుల సీబీఐ కోర్టుకు హాజరవుతుండటంతో.. కఠినంగా వ్యవహరించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చంఢీగఢ్: డేరా స్వచ్చ సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ వ్యవహారంపై హైకోర్టు సీరియస్ అయింది. కాసేపట్లో ఆయన పంచ్కుల సీబీఐ కోర్టుకు హాజరవుతుండటంతో.. కఠినంగా వ్యవహరించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెచ్చగొట్టే ప్రసంగాలు ఎవరు చేసిన ఎఫ్ఐఆర్ లు నమోదు చేయాలని ఆదేశించింది.
గుర్మీత్ సింగ్ కు తీర్పు ప్రతికూలంగా వస్తే లక్షల మంది ఆయన భక్తులు ఒక్కసారిగా తెగబడే అవకాశం ఉండటంతో భారీ సంఖ్యలో పోలీసులు అక్కడ మోహరించారు. ఇప్పటికే సిర్సా నుంచి లక్షన్నరకు పైగా భక్తులు పంచ్కులకు తరలి వచ్చినట్లు తెలుస్తోంది.

కొంతమంది భక్తులు పెట్రోలు, డీజిల్ వంటివి వెంట తీసుకొస్తుండగా, మరికొంతమంది మారణాయుధాలను తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది. గుర్మీత్ కోర్టుకు వెళ్లేదారిలో వేచి చూస్తున్న జనం.. వెళ్లవద్దంటూ ఆయనకు అడ్డుపడుతున్నారు.
సిర్సాలో కొన్ని వేలమంది జనం ఆయన కోసం తిండీ తిప్పలు మానేసి.. ఆయనకు శిక్ష పడకూడదంటూ ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద గుర్మీత్ భక్తుల హడావుడితో పంజాబ్, హర్యానాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితిలో పోలీసులంతా అప్రమత్తమయ్యారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పంచ్కుల, సిర్సా ప్రాంతాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అవసరమైతే మరిన్ని బలగాలను మోహరించాలంటూ హైకోర్టు సైతం ఆదేశించింది.
కాగా, 1999లో ఇద్దరు మహిళల భక్తులను రేప్ చేసినట్లుగా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్పై ఆరోపణలున్నాయి. దాంతో పాటు ఓ హత్య కేసు కూడా ఆయనను వెంటాడుతోంది. రేప్ కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం మధ్యాహ్నాం 2.30గం.కు తీర్పు వెలువరించనుంది.












Click it and Unblock the Notifications