నేపాల్లో 2500 మందికి పైగా మృతి: భారత్పై ప్రభావం, 51 మంది మృత్యువాత
న్యూఢిల్లీ: నేపాల్లో భూకంపం మహావిలయం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 2500 మందికి పైగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వేలాది మంది గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది. ప్రసిద్ధ పర్యాటక స్థలాలు, ప్రాచీన ఆలయాలు కుప్పకూలాయి. ఖాట్మాండులోని ప్రసిద్ధ ధరహార స్థూపం నేలమట్టమైంది.

భారత్లోను ప్రకంపనలు
పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. నేపాల్ను కుదిపేసిన భూకంపం భారత్ పైనా ప్రభావం చూపింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. బీహార్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ భూకంప తీవ్రతకు వణికిపోయాయి. గోడలు, ఇంటిపైకప్పులు కూలిపోయాయి. రహదారులు ధ్వంసమయ్యాయి.
ఈ మూడు రాష్ట్రాల్లో 51 మంది మృతి చెందగా, సుమారు 250 మంది గాయపడ్డారు. శనివారం ఉదయం పలు రాష్ట్రాల్లో 20 నుంచి 60 సెకన్లపాటు దేశవ్యాప్తంగా భూప్రకంపనలు సంభవించాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. నేపాల్ చెంతనే ఉన్న బీహార్లో భూకంప తీవ్రతకు భారీగా ఆస్తి, ప్రాణనష్టాన్ని సంభవించింది. 38 మంది మృతిచెందగా, 100 మంది వరకు గాయపడ్డారు.
బీహార్, నేపాల్ సరిహద్దులోని చంపారన్, సితామర్హి, సుపాల్ జిల్లాల్లో ప్రాణ,ఆస్తినష్టం ఎక్కువగా ఉంది. పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. బహుళ అంతస్థుల భవనాలు బీటలువారాయి. రాష్ట్రమంతా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. యూపీలో 10 మంది మృతి చెందారు. 70 మంది వరకు గాయపడ్డారు.
బారాబంకీ జిల్లా బసంత్పూర్లో ప్రకంపనల తీవ్రతకు నిర్మాణంలో ఉన్న భవనం కూలింది. భవన శిథిలాల కిందపడి తల్లీ ఇద్దరు బిడ్డలు మృతి చెందారు. అయోధ్యలోని కామాఖ్య ఆలయం పైకప్పు కూలిపోయింది. పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మృతి చెందగా 43 మంది పాఠశాల విద్యార్థులు సహా 80 మంది గాయపడ్డారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శనివారం భూమి కంపించింది. ఆరు భవనాలు పగుళ్లు ఇచ్చాయి.
ప్రకంపనలతో నివాసగృహాలు, కార్యాలయాల్లోని ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్రో రైలు సర్వీసులను నియంత్రించారు. సిక్కింలో ప్రకంపనల తీవ్రతకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలోను ప్రకంపనలు వచ్చాయి. అయితే, ఈ రాష్ట్రాల్లో ప్రాణ నష్టం జరగలేదు. నేపాల్ భూకంపం ప్రభావం చైనా, రష్యా, బంగ్లాదేశ్, భారత్ పైన కూడా కనిపించింది.












Click it and Unblock the Notifications