టీమిండియా కోసం ఎయిరిండియా ఫ్లైట్ మళ్లింపు ? డీజీసీఏ విచారణ కలకలం.. !
తాజాగా అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీమిండియా ఫైనల్ తర్వాత స్వదేశానికి చేరుకోవాల్సి ఉండగా.. బార్బడోస్ లో ప్రతికూల వాతావరణం కారణంగా అది సాధ్యం కాలేదు. దీంతో రెండు రోజులుగా బార్బడోస్ లోనే చిక్కుకుపోయిన టీమిండియాను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా ప్రయాణికుల విమానాన్ని అర్ధాంతరంగా రద్దు చేసి క్రికెటర్ల కోసం పంపింది.
నెవార్క్ నుంచి ఢిల్లీకి నడిచే ఎయిర్ ఇండియా విమానాన్ని రద్దు చేసి, దాన్ని బార్బడోస్ కు పంపి ఢిల్లీకి టీమిండియా క్రికెటర్లను తీసుకొచ్చిన వ్యవహారంపై విమర్శలు వచ్చాయి. ఇలా అర్ధాంతరంగా నెవార్క్-ఢిల్లీ సర్వీస్ రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. దీంతో ఎయిర్ ఇండియా చర్యపై డీజీసీఏకు ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించిన డీజీసీఏ ఇవాళ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది.

నెవార్క్ నుంచి ఢిల్లీ రావాల్సిన తమ విమానాన్ని అర్ధాంతరంగా రద్దు చేయడమే కాకుండా ప్రత్యామ్నాయాల కూడా చూపలేదని ప్రయాణికులు సోషల్ మీడియాలో పలు వీడియోలు పోస్టు చేశారు. వీటిపై స్పందించిన డీజీసీఏ అసలు ఏం జరిగిందో పూర్తి స్ధాయిలో వివరణ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించింది. క్రికెటర్లను స్వదేశానికి తీసుకురావడానికి బీసీసీఐ అధికారులతో సన్నిహిత సమన్వయంతో ఎయిర్ ఇండియా చార్టర్ ప్రాతిపదికన విమానాన్ని పంపిందని అధికారులు తెలిపారు.
నెవార్క్ నుండి ఢిల్లీకి మరొక ఎయిర్ ఇండియా విమానం ఏర్పాటు చేశాకే క్రికెటర్ల కోసం విమానం మళ్లించినట్లు అధికారులు తెలిపారు. 2017లో జారీ చేసిన డీజీసీఏ నిబంధనల ప్రకారం నాన్-షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాలను నడుపుతున్న ఎయిర్లైన్స్ షెడ్యూల్డ్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించకూడదని చెబుతున్నాయి. చార్టర్ ప్రాతిపదికన పంపాలంటే ప్రయాణికుల విమానాలు కాకుండా విడిగా పంపాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఇక్కడ అలా జరగకపోవడంపై డీజీసీఏ విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications