మమతా బెనర్జీ ఎఫెక్ట్?: డీజీపీని బదిలీ చేసిన కుమారస్వామి..
బెంగళూరు: కర్ణాటక సీఎం కుమారస్వామి డీజీపీ నీలమణి రాజుని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమాణస్వీకారవేళ ట్రాఫిక్ ని నియంత్రించడంలో డీజీపీ విఫలమైనందువల్లే ఆమెపై వేటుపడింది. మరీ ముఖ్యంగా.. ట్రాఫిక్ అంతరాయంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆయనకు ఫిర్యాదు చేయడం డీజీపీపై వేటుకు ప్రధానం కారణంగా తెలుస్తోంది.
బుధువారం సాయంత్రం విధానసౌదలో కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా.. పరిసర ప్రాంతాలన్ని కాంగ్రెస్, జేడీఎస్ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు.
కారు ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో మమతా బెనర్జీ కిందకు దిగి విదానసౌధ వద్దకు నడుచుకుంటూ వచ్చారు. కేజ్రీవాల్, మాయావతి కూడా నడుచుకుంటూనే వేదిక వద్దకు వచ్చారు. ఇక మమతా వేదిక వద్దకు రాగానే డీజీపీ ఎదురుపడటంతో ఆమెపై ఫైర్ అయ్యారు మమతా. ట్రాఫిక్ నియంత్రించే తీరు ఇదేనా? అంటూ మండిపడ్డారు. ఆపై దేవెగౌడ, కుమారస్వామిలతోనూ అంతే ఆవేశంగా డీజీపీపై ఫిర్యాదు చేశారు.
మమతా ఫిర్యాదుతో అసౌకర్యానికి చింతిస్తున్నట్టు కుమారస్వామి మమతకు క్షమాపణలు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణపై సీఎం స్థాయి వ్యక్తి నుంచి ఫిర్యాదు రావడంతో దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా కుమారస్వామి ఆదేశించారు. స్పందించిన డీజీపీ.. భారీ వర్షం కారణంగానే సమస్య తలెత్తిందని, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ కార్లు ఒక్కసారిగా విధాన సౌధ ప్రాంగణానికి రావడంతో ట్రాఫిక్ నియంత్రించలేకపోయామని చెప్పారు.
డీజీపీ సమాధానంపై సంతృప్తి చెందని కుమారస్వామి ఆమెను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కర్ణాటక చరిత్రలో తొలి మహిళా డీజీపీ నీలమణి రాజునే కావడం గమనార్హం.