ధారావి... ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్... ఇప్పుడు ప్లాస్మా దానంలో ముందు...
రెండు నెలల క్రితం వరకు కరోనా వైరస్ హాట్ స్పాట్గా ఉన్న ముంబైలోని మురికివాడ ధారావి... ఇప్పుడు కరోనాపై పోరుకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ముంబై నగరానికి ప్లాస్మా డొనేట్ చేయడంలో ఈ మురికివాడ ముందుంది.
ధారావిలో కరోనా సోకి కోలుకున్నవారిలో ఇప్పటికే 25శాతం మంది ప్లాస్మా డొనేట్ చేసేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక్కడి ప్రభుత్వ స్కూల్లో శివసేన ఎంపీ రాహుల్ షెవాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాస్మా డొనేషన్ క్యాంపులో చాలామంది ప్లాస్మా దానం చేశారు. దీంతో ధారావి ప్రజలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఉండేది మురికివాడ అయినప్పటికీ... గొప్ప మనసుతో వాళ్లు ప్లాస్మా దానానికి ముందుకొస్తున్నారని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైన ధారావిలో 10లక్షల పైచిలుకు జనాభా నివసిస్తారు. ఇప్పటివరకూ ఇక్కడ 2530 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2100 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇందులో 500 మంది ప్లాస్మా దానానికి ఒప్పుకున్నారు. మరికొంతమంది కూడా ప్లాస్మా దానానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్లాస్మా దానం చేసిన ధారావి ప్రజలను ముంబై మున్సిపల్ కమిషనర్ సత్కరించారు.
ధారావిలో కరోనా బారినపడి కోలుకున్నవారిలో యువకులు,అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్నవాళ్లే ఎక్కువగా ఉన్నారని సీనియర్ మున్సిపల్ అధికారి ఒకరు తెలిపారు. ఇందులో యువకుల ప్లాస్మా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ఇతరత్రా వ్యాధులేవీ లేకపోవడం,యాంటీ బాడీస్ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో యువకుల నుంచి సేకరించే ప్లాస్మా మంచి ఫలితాలనిస్తుందన్నారు. ఇప్పటివరకూ 49 మంది నుంచి ప్లాస్మా సేకరించినట్లు తెలిపారు.
జంబో టెస్టింగ్ సెంటర్ల ప్రారంభం సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే... ఆన్లైన్లో ప్రధాని మోదీకి ఈ విషయాన్ని వివరించారు. కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు చెప్పారు. కాగా,ప్రస్తుతం మహారాష్ట్రలో 1.48లక్షల కరోనా యాక్టివ్ కేసులున్నాయి.