ఏమీ అడగలేదు, కానీ శక్తి వచ్చింది: కేదార్నాథ్లో రాహుల్
డెహ్రాడూన్: కాలినడకన వచ్చిన కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఉదయమే ప్రాచీన కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. హిమాలయాల దిగువన ఉండే కేదార్నాథ్ ఆలయానికి ఆయన శుక్రవారం ఉదయం వచ్చి ప్రార్థనలు చేశారు.
ప్రధాన పూజారి ఆలయం తలుపులు తీయగానే పవిత్రమైన ఆలయంలోని శివుడికి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రార్థనలు చేశారు. 2013 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
రాజకీయ ప్రాబల్యం పెరగాలని కోరుకున్నారా అని మీడియా ప్రతినిధులు అడిగితే తాను దైవాన్ని ఏమీ కోరుకోలేదని, అయితే తనకు ఎనలేని శక్తి సమకూరిన భావన కలిగిందని సమాధానమిచ్చాడు.
సీనియర్ కాంగ్రెసు నాయకులతో కలిసి ఆయన 16 కిలోమీటర్ల నడిచి ఆలయానికి వచ్చారు. రాత్రిపూట గౌరీకుండ్లో బస చేశారు. గురువారంనాడు కాంగ్రెసు సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు.