లీటర్ డీజిల్పై రూ.25 పెంపు..వాటికి మాత్రమే వర్తింపు: ఆ వాతకూ రెడీ
న్యూఢిల్లీ: రష్యా ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి కొనసాగుతున్న యుద్ధం ప్రభావం- క్రూడాయిల్ సరఫరాపై తీవ్రంగా పడింది. క్రూడాయిల్ ప్రొడక్షన్, షిప్పింగ్ సంక్షోభం ఏర్పడటం వల్ల అంతర్జాతీయంగా వాటి రేట్లు భారీగా పెరిగాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లను దాటిన సందర్భాలు ఉన్నాయి. ఆ తరువాత ఆ ధర క్రమంగా తగ్గుతూ వచ్చింది. 110 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
బల్క్ అమ్మకాలపై..
యుద్ధం ఆరంభం కావడానికి ముందు రోజులతో పోల్చుకుంటే- ఈ రేటూ చాలా ఎక్కువ. 40 శాతం క్రూడాయిల్ ధర పైకి ఎగబాకింది. పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం భారత్పైనా పడింది. దేశీయ చమురు కంపెనీలు డీజిల్ అమ్మకాలను లక్ష్యంగా చేసుకున్నాయి. వాటి ధరను అమాంతం పెంచేశాయి. డీజిల్పై లీటర్ ఒక్కింటికి 25 రూపాయల అదనపు భారాన్ని మోపాయి. ప్రస్తుతానికి ఈ పెంపు బల్క్ అమ్మకాలకు మాత్రమే వర్తింపజేశాయి.
రవాణారంగంపై..
దీనివల్ల పబ్లిక్, ప్రైవేట్ రవాణా రంగం తీవ్రంగా ప్రభావితమౌతుంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్ యాజమాన్యాలు బల్క్గా డీజిల్ను కొనుగోలు చేస్తుంటాయి. లీటర్ డీజిల్కు అదనంగా 25 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా సంభవించే నష్టాలను అధిగమించడానికి ఛార్జీలను పెంచే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతానికి ఈ పెంపు బల్క్ అమ్మకాలకు మాత్రమే వర్తింపజేశాయి చమురు సంస్థలు. రిటైల్ అమ్మకాల ధరలో ఎలాంటి మార్పూ లేదు. పాత రేట్లే కొనసాగుతున్నాయి.
రిటైల్ అమ్మకాలపై..
మున్ముందు- ఈ పెంపుదల రిటైల్ డీజిల్ అమ్మకాలకూ వర్తింపు కాబోదనే గ్యారంటీ లేదు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈ పెంపుదల చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత సంవత్సరం దీపావళి సమయంలో పెట్రోల్పై అయిదు రూపాయలు, డీజిల్పై 10 రూపాయల మేర కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. అప్పటి నుంచి రేట్లు పెరగలేదు. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ బాదుడును మొదలు పెట్టాయి చమురు సంస్థలు.
25 రూపాయల భారం..
పెరిగిన రేట్ల ప్రకారం- బల్క్గా డీజిల్ను కొనుగోలు చేసే సంస్థలు ఇకపై ప్రతి లీటర్కూ 25 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ముంబైలో లీటర్ డీజిల్ ధర 94.14 పైసలు పలుకుతోంది. బల్క్గా కొనుగోలు చేయాల్సి వస్తే..లీటర్కు రూ.122.05 పైసలను చెల్లించాల్సి ఉంటుంది. దేశ రాజధానిలో బల్క డీజిల్ ధర లీటర్ ఒక్కింటికి రూ. 86.67 పైసల నుంచి 115 రూపాయలకు పెరిగింది. ఇదివరకు చమురు సంస్థలు పెంచిన రేట్ల కంటే అధిక చాలా ఎక్కువ.
ప్రైవేట్ బంకులు దివాళా..
ఈ భారాన్ని భరించకూడదనుకుంటే- బల్క్ కొనుగోలుదారులు కూడా రిటైల్ అవతారాన్ని ఎత్తాల్సి ఉంటుంది. చమురు కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా బంకుల వద్ద వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. బల్క్ డీజిల్ రేట్లు భారీగా పెరగడం వల్ల ప్రైవేటు బంకులు మూత పడటం ఖాయంగా కనిపిస్తోంది. జియో-బీపీ, షెల్, నయారా ఎనర్జీ వంటి సంస్థలు ప్రైవేట్గా పెట్రోల్ బంకులను నిర్వహిస్తోన్నాయి. వాటి నిర్వహణ ఇక పెనుభారంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు.
రిల్ బంకులు మూత..
దేశవ్యాప్తంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు ఉన్న 1,432 పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతపడే స్థాయికి చేరుకున్నాయి. బల్క్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఆయా కంపెనీలు తమ బంకులను మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తాజా పెంపుదలతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా డీజిల్ ధర రికార్డు స్థాయిలో చేరుకున్నట్టయింది. రిటైల్ కొనుగోలుదారులపై ఎంత మేర భారం పడుతుందనేది తెలియరావాల్సి ఉంది.