Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లతో బ్యాంకులకు బెనిఫిట్ ఇదీ!

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తున్నది.

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో నగదు లావాదేవీలు జరిపిన ప్రజానీకంతో బలవంతంగానైనా ఆన్‌లైన్‌/ మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జరిపేలా ఇటు కేంద్రం, అటు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రయత్నిస్తున్నాయి.

ఆన్ లైన్ లావాదేవీలు జరుపడం వల్ల బ్యాంకులకు ఖర్చు కూడా భారీగానే తగ్గుతున్నది మరి. ఈ విషయమై మాత్రం బ్యాంకుల యాజమాన్యాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి.ఇప్పటివరకు ఎటిఎంలలో నగదు విత్ డ్రాయల్స్ పై చార్జీలు విధించిన బ్యాంకులు. తాజాగా బ్యాంకుల్లో లావాదేవీలపైనా పరిమితులు విధించాయి. ఆ పరిమితి దాటితే మాత్రం ఖాతాదారులు భారీగా రుసుము చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఖాతాదారులు బ్యాంకుకే కాదు.. ఏటీఎం కేంద్రాలకు వెళ్లాలన్నా భయపడేలా 'భారీ ఛార్జీల' భారం వెంటాడుతున్నది.

పీఓఎస్ చెల్లింపుల రుసుము తగ్గించాలి

ఇక పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాల్లో డెబిట్ కార్డు గానీ, క్రెడిట్ కార్డు గానీ స్వైప్ చేసినా, ఆన్ లైన్ చెల్లింపులు జరిపినా సర్వీస్ చార్జీలు, ఇతర రుసుములు ఖాతాదారులను హడలెత్తిస్తున్నాయి. వీటిని తగ్గించాలన్న సూచనలు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఖాతాదారులు తమ ఖాతాలోని నగదు తిరిగి తీసుకోవడానికి (విత్‌డ్రా) రుసుమును చెల్లించాల్సి రావడం ఎవరికి మాత్రం ఇష్టముంటుంది.

Digital Payments is Savings route for banks

గమ్మత్తు ఏమిటంటే ఒక ఖాతాదారు ఆన్‌లైన్‌లో గానీ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా గానీ లావాదేవీ జరిపితే, బ్యాంకుకు 50 పైసల నుంచి రూ.2 మాత్రమే ఖర్చవుతుంది. అదే ఏటీఎం లావాదేవీపై రూ.12 - 15 వరకు, శాఖల్లో లావాదేవీపై రూ.50 - 60 వరకు ఖర్చవుతున్నది. ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించుకోవడం ద్వారా ఇంత భారం తగ్గేందుకు సహకరిస్తున్న ఖాతాదారులకు, రుసుముల ఉపసంహరణ ద్వారా ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులపైనా ఉన్నది.

ఖాతాదారుల సేవల కోసం బ్యాంకుల శాఖలు పెంచక తప్పదా?

ఖాతాదారులంతా నగదు ఉపసంహరణ కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే, మరింతమంది సిబ్బంది నియామకంతోపాటు బ్యాంకు శాఖలనూ పెంచాల్సి వస్తున్నది. బ్యాంకులో ఒక ఉద్యోగి తన పని వేళల్లో గరిష్ఠంగా 150 - 200 మంది ఖాతాదారులకు, వారి ఖాతాల్లోంచి నగదు తీసి ఇవ్వగలరు. బ్యాంకులో ఒక లావాదేవీ నిర్వహణ ఖర్చు రూ.50- 60 వరకు అవుతుంది. సిబ్బంది వేతనాలు, బ్యాంకు అద్దె, విద్యుత్ తదితర నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటమే ఇందుకు కారణం.

తడిసిమోపెడవుతున్న ఏటీఎంల నిర్వహణ

ఇదే రద్దీ ప్రాంతాల్లో ఉండే ఒక ఏటీఎంలో రోజుకు సగటున 500-600 లావాదేవీలు జరుగుతున్నాయి. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణకు ప్రతి లావాదేవీకి ఇప్పుడు బ్యాంకుకు రూ.12-15 వరకు ఖర్చవుతోంది. ఒక బ్యాంకు ఖాతాదారు, మరో బ్యాంకు ఏటీఎంలో నగదు తీసుకుంటే, సంబంధిత బ్యాంకుకు ఖాతాదారు బ్యాంకు లావాదేవీకి రూ.17 వరకు చెల్లిస్తోంది.

ఉచిత లావాదేవీల వరకు ఖాతాదారు తరఫున బ్యాంకు వేరే బ్యాంకుకు ఈ మొత్తం చెల్లిస్తున్నా, తర్వాత ఖాతాదారు నుంచే వసూలు చేస్తున్నది. ఇదీ దేశంలోని అన్ని బ్యాంకులకు వర్తిస్తుంది. ఏటీఎంలలో నగదు జమ చేసే బాధ్యతను కూడా బ్యాంకులు ప్రైవేట్ సంస్థలకే కేటాయించాయి. బ్యాంక్ నుంచి నగదు తీసుకువెళ్లి, ప్రతి ఏటీఎంలో జమ చేసినందుకు ఏజెన్సీలకు బ్యాంకులు వేల రూపాయలు చెల్లిస్తున్నాయి.

అక్కడి లావాదేవీల సంఖ్య, జమచేసే మొత్తం ఆధారంగా ఈ ఛార్జీలు ఉంటాయి. ఆయా ఏటీఎం కేంద్రాల విద్యుత్ బిల్లు, ఇతర నిర్వహణ ఖర్చులతోపాటు భద్రతా సిబ్బంది కోసం నెలకు రూ.30 వేల నుంచి రూ.32 వేల వేతనం చెల్లిస్తున్నారు. దీనికి ప్రకారం ఒక్కో ఏటీఎం కేంద్రం నిర్వహణ నెలకు రూ.50 వేల నుంచి రూ. 70 వేల వరకు ఖర్చవుతున్నది.

పెద్ద నోట్ల రద్దు నుంచీ ఏటీఎంల మూతే

పెద్దనోట్ల రద్దు నిర్ణయం వెలువడిన నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ వరకు అత్యధిక ఏటీఎంలు మూసే ఉన్నాయి. గమ్మత్తు ఏమిటంటే దేశంలోని బ్యాంకులన్నీ కలిపి గత జనవరి వరకు 2,20,402 ఏటీఎంలను నెలకొల్పినట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు చెప్తున్నాయి.

నోట్ల రద్దు తర్వాత ప్రైవేట్ రంగ బ్యాంకుల ఎటిఎంలు ఎక్కువగా తెరచుకోలేదు. ప్రభుత్వరంగ బ్యాంకులే ఎక్కువ ఏటీఎంలలో నగదు నింపి, సహకరించాయని ఖాతాదారులు అప్పట్లో చెప్పారు. ఏటీఎం కేంద్రాలు మూసి ఉన్నా, బ్యాంకులకు ఖర్చు మాత్రం తప్పలేదు. మళ్లీ గత వారం నుంచీ ఏటీఎంలు మూసే ఉంటున్నాయి. లావాదేవీలు జరపకున్నా, ఈ భారం బ్యాంకు పద్దుల్లోకి చేరుతున్నది. తద్వారా పరోక్షంగా మళ్లీ ఖాతాదార్లపైనే పడుతుంది.

ఖాతాదారులకు ప్రయోజనం కల్పించాల్సిన బాధ్యత బ్యాంకులదే

దేశవ్యాప్తంగా డెబిట్‌/క్రెడిట్‌కార్డుల ద్వారా వాణిజ్య సంస్థల్లో బిల్లులను చెల్లించేందుకు వీలు కల్పించే పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) యంత్రాలు 20,15,847 ఉన్నాయి. కార్డు స్వైపింగ్‌కు అవుతున్న రుసుం భారం కొన్ని సంస్థలు భరిస్తుంటే, మరికొన్ని ఖాతాదారులకే విధిస్తున్నాయి.

లావాదేవీలను పరిమితం చేసినందున, నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వేతనం వచ్చే వారు కూడా ఒకేసారి అధిక మొత్తాలు ఉపసంహరిస్తే, పొదుపు/కరెంట్‌ ఖాతాల్లో నగదు నిల్వలు తగ్గుతాయని, ఇది బ్యాంకులకే నష్టమని విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఆన్‌లైన్ లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

మొబైల్‌/ఆన్‌లైన్‌ లావాదేవీలకు ప్రత్యేకంగా భారం పడకుండా ఖాతాదార్లకు సహకరించవచ్చు. గత జనవరిలో దేశంలో రూ.1,38,298 కోట్ల విలువైన 10.61 కోట్ల లావాదేవీలు మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిగాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా జరిపే లావాదేవీలకు సంబంధించి ఏ వివరాలు ఫోన్‌/సిమ్‌కార్డులో నమోదు కావు. ఇందువల్ల ఫోన్‌, సిమ్‌కార్డు పోయినా, దొంగతనానికి గురైనా ఖాతా వివరాలు బయటకు రావు. వీటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం బ్యాంకులకు ఎంతైనా ఉన్నదని ఖాతాదారులు, వివిధ వ్యాపార వాణిజ్యవేత్తలు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+