చానెళ్ల బ్యాన్ సరి కాదు, ఎపి ప్రజలకు అండ: దిగ్విజయ్
హైదరాబాద్: తెలంగాణలో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, టీవీ9 ఛానెళ్ల ప్రసారాలపై నిషేధం విధించడం సరి కాదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. సోమవారం టి.కాంగ్రెస్ మేధోమధన సదస్సులో ఆయన మాట్లాడారు.
మీడియాకు అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. మన దేశంలో ఎవరైనా, ఎక్కడైనా జీవించవచ్చన్నారు. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటామని దిగ్విజయ్ భరోసా ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలవగా, బిజెపి 7 స్థానాల్లో మాత్రమే గెలిచిందన్నారు. భవిష్యత్ కార్యాచరణ సదస్సు విజయవంతమైందని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు మెదక్లో గెలుపు కోసం పనిచేయాలని దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణలో పార్టీ సరైన ఫలితాలు సాధించుకపోవడానికి కారణాలను అన్వేషించే పనిలో దిగ్విజయ్ సింగ్ పడ్డారు. ఇందులో భాగంగా మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో కాంగ్రెసు తెలంగాణ నాయకులు తమ తమ పద్ధతిలో ఓటమికి కారణాలను విశ్లేషించారు.