నరసింహన్తో చర్చలపై దిగ్విజయ్ సింగ్ దాటవేత
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ తనతో ఏం మాట్లాడారనే విషయాన్ని వెల్లడించడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ దాటవేశారు. గవర్నర్ తనను కలవడం సంతోషంగా ఉందని మాత్రమే అన్నారు. కేంద్ర మంత్రులతో, కాంగ్రెసు అధిష్టానం పెద్దలతో గవర్నర్ భేటీ అవుతూ ఢిల్లీలో తీరిక లేకుండా గడుపుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా ఆయన సమావేశమయ్యారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల తలెత్తే సమస్యలను కేంద్ర మంత్రుల బృందం పరిష్కరిస్తుందని ఆయన చెప్పారు. రాజీనామా చేసిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను పిలిచి మాట్లాడుతానని ఆయన చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. భద్రాచలం తెలంగాణలో ఉండడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు వచ్చే ఇబ్బంది ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశఆరు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే విషయంపై తాను ఎవరితోనూ మాట్లాడలేదని, ఎలాంటి చర్చ కూడా చేయలేదని ఆయన అన్నారు. హైదరాబాదును యుటి చేయాలనేది చాలా సున్నితమైన అంశమని, ఈ విషయాన్ని మంత్రుల బృందం చూసుకుంటుందని ఆయన చెప్పారు.
గవర్నర్ నరసింహన్ కేంద్ర మంత్రుల బృందం సభ్యుడైన జైరాం రమేష్తో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆయన కలుసుకున్నారు. తాను మర్యాదపూర్వకంగానే భేటీ అవుతున్నట్లు గవర్నర్ చెబుతున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కార్యాచరణపైనే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.