ఢిల్లీ బహుత్ దూర్: కిరణ్ రెడ్డిపై దిగ్విజయ్ సెటైర్
న్యూఢిల్లీ: తాము ఆహ్వానించినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాకపోవడంపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ఆగ్రహంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఢిల్లీ బహుత్ దూర్ హై అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యపై ఆయన సెటైర్ వేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీ నుంచి కూడా హైదరాబాద్ దూరమేనని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలలో కొత్త విషయం ఏమీ లేదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను చెప్పే వీలుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు గడువు పెంపు విషయాన్ని రాష్ట్రపతే నిర్ణయిస్తారని ఆయన చెప్పారు.
రాజ్యసభ అభ్యర్ధులపై కసరత్తు పూర్తయి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం జరుగుతుందని దిగ్వివిజయ్ సింగ్ చెప్పారు. రాజ్యసభ అభ్యర్ధులు ఎవరనేది కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయిస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించడం సరి కాదని, అలా వ్యతిరేకించాలంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసు అధిష్టానం వల్లనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని ఆయన గుర్తు చేశారు. బిల్లును వెనక్కి పంపాలని అనడం చట్ట వ్యతిరేకం, అనైతికమని ఆయన అన్నారు. శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలంటే మంత్రి వర్గ ఆమోదం అవసరమని ఆయన అన్నారు.