తగ్గకపోతే వారిపై చర్యలు: డిగ్గీ, అప్రమత్తం: కోదండరామ్
న్యూఢిల్లీ/ హైదరాబాద్: తమ యుపిఎ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నోటీసును వెనక్కి తీసుకోకపోతే పార్లమెంటరీ నిబంధనల ప్రకారం తమ పార్టీ పార్లమెంటు సభ్యులపై చర్యలుంటాయని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతాయని ఆయన కొన్ని టీవీ చానెళ్ల ప్రతినిధులతో బుధవారం అన్నారు.
అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన పార్టీ పార్లమెంటు సభ్యులతో తాను మాట్లాడుతన్నానని, నోటీసును వెనక్కి తీసుకోవాలని సూచించానని ఆయన చెప్పారు. విభజన నిర్ణయానికే ముందే పార్టీ పార్లమెంటు సభ్యులతో, శాసనసభ్యులతో చర్చించామని, పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వారు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే నిర్ణయంతో ఉన్నారని అనుకుంటున్నట్లు తెలిపారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంటు ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ తెలంగాణ ప్రజలకు సూచించారు. జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ శాసనసభ్యులంతా పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండి రాష్ట్ర విభఝన ముసాయిదా బిల్లు ప్రక్రియను ముగించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల మధ్య ఐక్యతకు తాము కృషి చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. బిల్లులో సవరణల కోసం ప్రయత్నాలు చేస్తామని, ఇందు కోసం తాము ఢిల్లీ వెళ్తామని ఆయన ఆయన చెప్పారు.