టూల్కిట్, ప్రో ఖలిస్థానీతో జూమ్ మీట్: దిశ రవి, శంతను, నికిత కుట్రదారులేనంటూ పోలీసులు
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ షేర్ చేసిన 'టూల్ కిట్'ను రూపొందించడంలో సామాజిక కార్యకర్త దిశతోపాటు నికితా జాకబ్, శాంతనులే కీలక సూత్రధారులని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మీడియాకు వివరించారు.
గ్రేటాకు టూల్ కిట్.. దిశ ద్వారానే
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలపై రూపొందించిన టూల్కిట్ను ఈ ముగ్గురే(దిశ, నికితా, శాంతను) గ్రేటా థన్బర్గ్కు పంపించారని తెలిపారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే నమోదైన దేశ ద్రోహం కేసులో దిశరవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ టూల్కిట్ను చేరవేసేందుకు దిశ ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసినట్లు ఢిల్లీ జాయింట్ కమిషన్ ఆఫ్ పోలీస్(సైబర్) ప్రేమ్ నాథ్ వెల్లడించారు. అయితే, ఈ వాట్సాప్ గ్రూపును దిశ తొలగించినట్లు గుర్తించామన్నారు.
ప్రో ఖలిస్థానీతో జూమ్ మీట్..
అంతేగాక, గణతంత్ర దినోత్సవం ముందు రోజు ఖలిస్థాన్ గ్రూపునకు చెందిన పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్(జీజేఎఫ్) ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్లో నికితా జాకబ్, శంతను పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. అంతేగాక, టూల్కిట్ను ఎడిట్ చేసినవారిలో నికితా జాకబ్ కూడా ఉన్నారని ఢిల్లీ పోలీసులు చెప్పారు. కాగా, టూల్కిట్ వ్యవహారంలో సంబంధం ఉందనే ఆరోపణల నేపథ్యంలో నికితా జాకబ్, శంతనులపై పోలీసుల వినతి మేరకు ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
దిశనే కీలక కుట్రదారు
కాగా, ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా టూల్కిట్ అనే డాక్యుమెంట్ను గ్రేటా థన్బర్గ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ట్విట్టర్ ఆందోళనలు, భారత రాయబార కార్యాలయాల వెలుపల నిరసన కార్యక్రమాలు, ఇతర ఆందోళన ఎలా చేపట్టాలనే జాబితాను దీనిలో సూచించారు. ఈ టూల్కిట్ దిశ రవి ఎడిటర్గా వ్యవహరించారని, దీని తయారీలో, ప్రచారం కల్పించడంలో కూడా ఆమె కీలక కుట్రదారుగా ఉన్నారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. నికితా, శాంతనుల పాత్ర కూడా ఉందని వివరించారు. కాగా, దిశ రవి అరెస్టుపై విపక్షాలు మండిపడుతున్నాయి. దిశను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.