నితీష్ కుమార్కు షాక్, చెక్కును తిప్పిపంపిన అమరజవాన్ కుటుంబం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇచ్చిన చెక్కును ఓ అమరజవాన్ కుటుంబం తిరస్కరించింది. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరజవానుకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఉగ్రవాదుల గుళ్లకు బలైన జవానును మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిలా చూస్తారా? చెక్కు మీరే తీసుకోండంటూ ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.
శ్రీనగర్లోని కరణ్ నగర్ ఏరియాలో గత సోమవారం ఉగ్రవాదుల తూటాలకు బీహార్కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ ముజాహిద్ ఖాన్ తీవ్రంగా గాయపడి అదేరోజు సాయంత్రం ఆసుపత్రిలో కన్నుమూశాడు. బుధవారం ఆయన భౌతికకాయం అర్రా జిల్లాలోని పీరో గ్రామానికి చేరుకుంది.
అతని భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నితీష్ ప్రభుత్వం నిర్ణయించింది. అంత్యక్రియలకు రాజకీయ పార్టీల నేతలు కానీ, అధికారులు కానీ హాజరు కాలేదు. ఇది స్థానికుల ఆగ్రహానికి కారణమైంది.
అంత్యక్రియల సమయంలో సబ్ డివిజనల్ స్థాయి అధికారి ఒకరు అతని కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చెక్కు అందించేందుకు వచ్చారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని తిప్పి పంపించారు.
అమరజవాను సోదరుడు మాట్లాడుతూ.. తన సోదరుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని, ఆయనకు ఎలాంటి మర్యాద ఇచ్చారో చూడండని, తమ అన్న తాగి చనిపోయాడా, ఈ సొమ్ముతో మేం ఏం చేసుకోవాలని ప్రశ్నించారు.