కర్ణాటక ప్రభుత్వంపై 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు, ఢిల్లీకి పిలిచిన కాంగ్రెస్ హైకమాండ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు రాలేదని కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలను ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించింది. అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఎంబి. పాటిల్ తదితరులు శనివారం ఢిల్లీ వెలుతున్నారు.
20 మంది కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలను ఒక్కటి చేసిన ఎంబి. పాటిల్ కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి మూడు రోజుల నుంచి సినిమా చూపిస్తున్నారు. మంత్రి పదవులు విషయంలో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు హైకమాండ్ మీద బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్, సీనియర్ మంత్రలు డీకే. శివకుమార్, ఆర్ వీ. దేశ్ పాండే, కృష్ణభైరే గౌడ, జమీర్ అహమ్మద్, దినేష్ గుండూరావ్ తదితరులు ఎంబి. పాటిల్ ఇంటికి వెళ్లి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు.
ఎంత మంది నాయకులు నచ్చచెప్పినా ఎంబి. పాటిల్ మాత్రం ఆయన మనసు మార్చుకోలేదు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ ఎంబి. పాటిల్ తో పాటు అసమ్మతి ఎమ్మెల్యేలను ఢిల్లీకి రావాలని సూచించింది. శనివారం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ, గులామ్ నబి ఆజాద్, కేసీ. వేణుగోపాల్ తదితరులతో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications