ఎక్కువ మాట్లాడి అంత వరకు తెచ్చుకోకుండి, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ అండ్ హాట్ వార్నింగ్ !
బెంగళూరు: పార్టీ అభిప్రాయాలను మీడియా ముందు బహిరంగంగా చెబుతున్న శాసనసభ్యులను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ హెచ్చరించారు. కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు ఓ పక్క సంతోషంతో పాటు మరో పక్క సొంతపార్టీలో అసమ్మతి నేతల తలనొప్పి ఎక్కువ కావడంతో ఆ పార్టీ నాయకులు కొందరు తలలు పట్టుకుంటున్నారు.
శనివారం సదాశివనగర్లోని నివాసం దగ్గర మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా సరే పార్టీ, ప్రభుత్వ, అధికార అంతర్గత వ్యవహారాలపై మీడియా ముందు మాట్లాడి అనవసరంగా రాద్ధాంతం చేయరాదని సూచించారు. నేను చెప్పిన తర్వాత కూడా మీడియా ముందు ప్రకటన చేస్తే ఎలాంటి మూలాజు లేకుండా వారికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని డీకే శివకుమార్ ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎర వేస్తున్నదని మండ్య ఎమ్మెల్యే రవి చేసిన ప్రకటనపై మీడియా అడిగిన ప్రశ్నకు డీకీ శివకుమార్ సమాధానమిచ్చారు. బీజేపీ కుట్రలు, ఎత్తుల గురించి మాకు తెలుసు. దీని వెనుక పెద్ద పెద్ద నాయకులు ఉన్నారని, అయితే వాళ్లు అనుకున్నది ఏమీ జరగదని కర్ణాటక డీసీఎం డీకే శికుమార్ ధీమాగా చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సహాయకుడు ఎన్ఆర్ సంతోష్ నేతృత్వంలోని ఓ బృందం కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపిందని, గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్లో చేరిన ఆ సంతోష్ ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయినా అతనికి ఇంకా బుద్దిరాలేదని, మళ్లీమళ్లీ అతను ఆపరేషన్ కమల అంటూతిరుగుతున్నాడని డీకే శివకుమార్ మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్లు, మంత్రి పదవి ఇస్తామని సంతోష్ ఎర చూపారని మండ్య ఎమ్మెల్యే రవి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీ విమానంలో పిలుచుకుని వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీలు కూడా ఇచ్చారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేతో సంతోష్ మాట్లాడిన ఆడియో, వీడియో క్లిప్పింగ్ లను తగిన సమయంలో విడుదల చేస్తామని శుక్రవారం మండ్య ఎమ్మెల్యే రవి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications