‘డీఎం సాబ్.. మాట్లాడుతున్నది తేజస్వి యాదవ్’: సార్.. సార్ అంటూ దిగొచ్చిన కలెక్టర్(వీడియో)
పాట్నా: ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి షాకిచ్చారు. గత నవంబర్ నెలలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప సీట్ల తేడాతో ముఖ్యమంత్రి పదవిని దూరం చేసుకున్న ఆయనకు రాష్ట్రంలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. మాస్ లీడర్గా ఎదుగుతున్నారు. తాజాగా, ఆయన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు.. డీఎం సాబ్.. మై తేజస్వి యాదవ్ అంటూ షాకిచ్చిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఔత్సాహిక టీచర్ల ధర్నాకు మద్దతుగా తేజస్వి..
ఆ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాట్నాలోని ఎకో పార్కు వద్ద తమ సమస్యలను తీర్చాలంటూ ధర్నాకు దిగారు ఔత్సాహిక ఉపాధ్యాయులు. వీరికి మద్దతు తెలిపేందుకు తేజస్వి యాదవ్ అక్కడికి వెళ్లారు. అయితే, ధర్నాకు అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది.
ధర్నాకు పర్మిషన్ ఇవ్వాలంటూ డీఎంకు తేజస్వి యాదవ్ ఫోన్
ఈ క్రమంలో అక్కడ్నుంచే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పాట్నా జిల్లా మేజిస్ట్రేట్(డీఎం)కు ఫోన్ చేసి వారి ధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా, పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్తో మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. డీఎంతో తేజస్వి మాట్లాడుతూ.. ధర్నాలో కూర్చునేందుకు అనుమతివ్వడం లేదని యువకులు చెబుతున్నారు. ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రతిరోజూ అనుమతి తీసుకోవాలా? పోలీసులు లాఠీఛార్జీ చేశారు. వారు తీసుకొచ్చిన ఆహారాన్ని విసిరేశారు. నిరసనకారులను చెదరగొట్టారు. అని అక్కడి పరిస్థితులను డీఎంకు వివరించారు తేజస్వి. వారిలో ఇంకొందరు ఎకో పార్కు వద్ద తనతోనే ఉన్నారని తేజశ్వి తెలిపారు.
డీఎం సాబ్.. మాట్లాడుతున్నది తేజస్వి యాదవ్..
ఆందోళనకారుల దరఖాస్తు తాను వాట్సాప్లో పంపిస్తానని, ధర్నా చేసుకోనివ్వాలని తేజస్వి కోరారు. దీనికి స్పందించిన డీఎం చంద్రశేఖర్ సింగ్.. దరఖాస్తు పంపిస్తే పరిశీలిస్తామని బదులిచ్చారు. ఎప్పుడు అనుమతిస్తారు? అని తేజస్వి ప్రశ్నించారు. దీంతో నన్ను మీరు ప్రశ్నిస్తారా? అంటూ సింగ్ గట్టిగా బదులిచ్చారు. దీంతో 'డీఎం సాబ్.. నేను తేజస్వి యాదవ్ని మాట్లాడుతున్నా.. 'అని చెప్పారు.
సార్ సార్ అంటూ దిగొచ్చిన డీఎం.. గట్టిగా నవ్విన నిరసనకారులు, మాస్ లీడర్
వెంటనే అప్రమత్తమైన డీఎం తన గొంతును సవరించుకున్నారు. 'ఓకే.. సార్.. సార్.. ' అన్నారు. దీంతో ధర్నాలో పాల్గొన్నవారంతా గట్టిగా నవ్వారు. ఆ తర్వాత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. దరఖాస్తు వాట్సాప్లో పంపిస్తా.. త్వరగా స్పందించండి. లేకపోతే రాత్రంతా ఇక్కడే కూర్చుంటాం అని ఉన్నతాధికారికి స్పష్టం చేశారు. కాగా, డీఎంతో తేజస్వి సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. తేజస్వి యాదవ్ మాస్ లీడర్ అంటూ పలువురు పేర్కొంటున్నారు.