కరుణానిధికి అస్వస్థత: డ్రగ్స్ ఎలర్జీయే కారణం!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అస్వస్థతకు గురైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. రోజువారీగా తీసుకునే కొన్ని మందులు పడక పోవడంతో అలర్జీకి గురైనట్లు వారు పేర్కొన్నారు.
వైద్యుల సూచన మేరకు కరుణానిధి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. పలువురు పార్టీ ముఖ్యనేతలు మంగళవారం ఆయన్ను పరామర్శించారు.
కాగా, కావేరి జలాల అంశంపై చర్చించేందుకు డీఎంకే మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుకు పిలుపునిచ్చింది. అయితే, కరుణానిధి అస్వస్థతకు గురికావడంతో డీఎంకే వర్గాలు కొంత ఆందోళనకు గురయ్యాయి.
ఇది ఇలా ఉండగా, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుమారు 20రోజుల నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో అనారోగ్య కారణంగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం కోలుకున్నారని, వచ్చే ఆదివారం వరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి.