పళనిస్వామికి డీఎంకె టెన్షన్?: హైకోర్టు ఏం చెప్తుందో?.. సీబీఐకి అప్పగిస్తే అంతేనా!
ఎడతెగని అనిశ్చితి.. ఎప్పుడెవరు ఏ గ్రూపులో చేరుతారో తెలియని పరిస్థితి.. మొత్తంగా అన్నాడీఎంకె రాజకీయాలన్ని ఇప్పటికీ గందరగోళంగానే ఉన్నాయి.
చెన్నై: ఎడతెగని అనిశ్చితి.. ఎప్పుడెవరు ఏ గ్రూపులో చేరుతారో తెలియని పరిస్థితి.. మొత్తంగా అన్నాడీఎంకె రాజకీయాలన్ని ఇప్పటికీ గందరగోళంగానే ఉన్నాయి. అమ్మ మరణించింది మొదలు ఇప్పటిదాకా ఆ పార్టీ రాజకీయాలు లెక్కలేనన్ని మలుపులు తిరుగుతూనే ఉన్నాయి.
పార్టీ ఎప్పుడు ఎవరి గుప్పిట్లోకి వెళ్తుందో తెలియని పరిస్థితుల్లో.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికే సీఎం పళనిస్వామి ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఓ పన్నీర్ సెల్వం గండం ఆయన్ను వెంటాడుతుండగానే.. మరోవైపు డీఎంకె పార్టీ సైతం అన్నాడీఎంకెను చిక్కుల్లోకి నెట్టాలని చూస్తోంది.
పళని ప్రభుత్వంపై స్టాలిన్, ప్రశ్నలు ముందే చెప్పాలన్న శశికళకు షాక్
ఈ నేపథ్యంలోనే పళనిస్వామి విశ్వాస పరీక్షపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గతంలో హైకోర్టును ఆశ్రయించింది డీఎంకె. దీనికి సంబంధించి ఈ నెల 16న విచారణ జరగనుండటంతో సీఎం సహా అన్నాడీఎంకె ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. డీఎంకె ఆరోపిస్తున్నట్లుగా.. డబ్బులకు అమ్ముడుపోయారన్న వాదనలకు బలం చేకూరితే తమ పరిస్థితేంటని వారు తలపట్టుకున్నారు.
డీఎంకె న్యాయవాది ఏం చెప్పారు?:
గత ఫిబ్రవరి 18న నిర్వహించిన విశ్వాస పరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా గతంలో హైకోర్టులో పిటిషన్ వేశామని డీఎంకె తరుపు న్యాయవాది షణ్ముగ తెలిపారు. 18వ తేదీన ఈ పిటిషన్ విచారణకు వస్తుందన్నారు. పళనిస్వామి విశ్వాస పరీక్షలో ఎమ్మెల్యేలంతా ఆయనకు అనుకూలంగా ఉండేందుకు.. తలా రూ.2కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు చెల్లించినట్లు ఆయన ఆరోపించారు.
ఈ అక్రమాలన్ని ఒక ప్రైవేటు టీవీ చానెల్లో ప్రసారం కావడంతో.. ఆరోపణలు నిజమేనని భావిస్తున్నామని షణ్ముగ పేర్కొనడ గమనార్హం. కాగా, అన్నాడీఎంకె ప్రభుత్వ, ఎమ్మెల్యేల అక్రమాలపై సీబీఐ, ఐటీ శాఖల చేత విచారణ చేయించాల్సిందిగా డీఎంకె న్యాయవాది బెంచ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు రానుంది.
పన్నీర్ తో విభేదాల నడుమ!:
జయలలిత మృతి తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని భావించిన శశికళపై పన్నీర్ సెల్వం ధిక్కారం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాల్లో అక్రమాస్తుల కేసుల్లో శశికళ జైలుకెళ్లడం.. పళనిస్వామి సీఎం అవడంతో పన్నీర్ సెల్వంకు చెక్ పడింది.
ఇంతలో దినకరన్ ఆర్కేనగర్ ఉపఎన్నికలో ఎలక్షన్ కమిషనర్ కు లంచం ఎరవేసి ఇరుక్కుపోవడం ఆ పార్టీని మరింత కుదేలయ్యేలా చేసింది. ఈ పరిణామంతో పన్నీర్ సెల్వంకు మరోసారి పార్టీని తనవైపుకు తిప్పుకునే అవకాశం దక్కింది. పన్నీర్ నాయకత్వమే బెటర్ అని కొంతమంది ఆయన వైపు వెళ్లి.. తిరిగి పళని గూటికి చేరారు.
క్యాంప్ రాజకీయాల వల్లే!:
శశికళ జైలుకు వెళ్లే ముందు చెన్నై శివారులోని ఫాంహౌజ్ నుంచి పార్టీ రాజకీయాలను ఆమె ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. తన అనుయాయి పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తూ.. ఎమ్మెల్యేలంతా ఆయన వెంట ఉండాలని సూచించింది. అనుకున్నట్లే ఆ తర్వాత పార్టీ రాజకీయాలు కొంత స్థిరత్వాన్ని సంతరించుకున్నట్లు కనిపించాయి.
కానీ పార్టీలోని లుకలుకలను ఎలా బయటపెట్టాలా? అని అటు ప్రతిపక్షం డీఎంకె తీవ్రంగా ప్రయత్నిస్తుండటం అన్నాడీఎంకెకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క్యాంప్ రాజకీయాలతో ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి ప్రలోభాలకు గురిచేశారని డీఎంకె హైకోర్టులో పిటిషన్ వేయడం ఇప్పుడా పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది.
ఎమ్మెల్యే శరవణన్ వీడియోతో:
పన్నీర్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే శరవణన్ సైతం ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కానీ ఇంతలోనే మాట మార్చిన ఆయన.. అది నకిలీ వీడియో అంటూ కొట్టిపారేశారు. వీడియో ప్రసారం చేసినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
అన్నాడీఎంకె వాదన ఇలా:
కూవత్తూరులోని ఫాంహౌజ్ లో ఎమ్మెల్యేలను భారీ మొత్తానికి కొనుగోలు చేశారన్న ఆరోపణలను ఎమ్మెల్యేల వెట్రివేల్ ఖండించారు. ఇలా అన్నాడీఎంకె నేతలు తమపై వస్తున్న ఆరోపణలు తోసిపుచ్చుతున్న క్రమంలోనే.. శరవణన్ మాట్లాడిన మరో వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలోను ఎమ్మెల్యేల కొనుగోలుపై శరవణన్ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ గండాలన్నింటి నుంచి ఎలా బయటపడాలని అన్నాడీఎంకె కొట్టుమిట్టాడుతోంది.