ఆపరేషన్ చేస్తుంటే బొద్దింకలు.. ప్రభుత్వాసుపత్రులు ఇంత అద్వాన్నమా!?
సర్జరీ ప్రారంభించిన కొద్దిసేపటికే.. ఆపరేషన్ థియేటర్ లో బొద్దింకలు తిరగడం వారిని తీవ్రంగా ఇబ్బందికి గురిచేసింది.
థానే: ప్రభుత్వాసుపత్రుల్లో పరిశుభ్రతకు ఎప్పుడూ జబ్బు చేస్తూనే ఉంటుంది. మురికి కూపాలుగా దర్శనమిచ్చే ప్రభుత్వాసుపత్రులకు మనదేశంలో కొదువలేదు. దీనివల్ల రోగులు మాత్రమే కాదు.. వైద్యులు సైతం సరిగ్గా పనిచేయలేని దుస్థితి నెలకొంది. తాజాగా మహారాష్ట్రలోని థానే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.
థానేలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆసుపత్రిలో డాక్టర్ సంజయ్ బరన్ వాల్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు. గత శుక్రవారం కాలు ఫ్రాక్చర్ కేసు ఒకటి వచ్చింది. 45ఏళ్ల వయసున్న సదరు పేషెంట్ కు సంజయ్ సర్జరీ చేయాలని చెప్పారు.
అనుకున్నట్టే.. ఆపరేషన్ థియేటర్ లో సర్జరీ చేయడం మొదలుపెట్టారు. అయితే సర్జరీ ప్రారంభించిన కొద్దిసేపటికే.. ఆపరేషన్ థియేటర్ లో బొద్దింకలు తిరగడం వారిని తీవ్రంగా ఇబ్బందికి గురిచేసింది.
బొద్దింకలంతా గదిలో తిరుగుతుంటే.. ఆపరేషన్ పై ఏకాగ్రత పెట్టడం కష్టంగా మారింది. దీంతో కొద్దిసేపు ఆపరేషన్ నిలిపివేసి.. బొద్దింకలు తిరుగుతుండటాన్ని డాక్టర్ సంజయ్ వీడియో తీశారు. అనంతరం సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.
థానే మునిసిపల్ కార్పోరేషన్ వారు నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో పారిశుధ్యం విషయంలో మాత్రం అలసత్వం కొనసాగుతూనే ఉంది. ఎన్నిసార్లు దీనిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవట్లేదని డాక్టర్ సంజయ్ వాపోయారు.
సర్జరీలు సక్సెస్ అయినా.. చాలామంది కీటకాల బారిన పడి ఇన్ ఫెక్షన్ కు గురవుతున్నారని సంజయ్ పేర్కొన్నారు. సిబ్బంది కొరతే దీనంతటికి కారణమని అన్నారు. ఆసుపత్రి డీన్ మైత్రాను దీనిపై స్పందించమని కోరగా.. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.