పట్టపగలు ఎస్ఐని పొడిచి చంపేసిన దొంగలు
బెంగళూరు: విధినిర్వహణలో ఉన్న ఎస్ఐని దొంగలు అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపేసిన సంఘటన బెంగళూరు గ్రామీణ జిల్లాలో జరిగింది. దోడ్డబళ్లాపుర పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్ పెక్టర్ జగదీష్ (33) అనే పోలీసు అధికారి శుక్రవారం హత్యకు గురైనారు.
సబ్ ఇన్స్ పెక్టర్ ను హత్య చేసిన నిందితులు చాకచక్యంగా తప్పించుకున్నారు. తీవ్రగాయాలైన కానిస్టేబుల్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. హత్య చేసిన నిందితులు జగదీష్ సర్వీస్ రివాల్వర్ లాక్కొని పరారైనారు.
కృష్ణ (తండ్రి), మధు తండ్రీకుమారులు. వీరిద్దరూ పాత నేరస్తులు. బైక్ లు చోరీలు చేస్తున్నారనే కేసులలో వీరి కోసం దోడ్డబళ్లాపురం పోలీసులు గాలిస్తున్నారు. శుక్రవారం ఉదయం నెలమంగల సమీపంలోని గ్రాఫైట్ ఫ్యాక్టరీ సమీపంలో కృష్ణ, మధు చోరీ చేసిన బైక్ లో పారిపోతున్నారని ఎస్ఐ జగదీష్ కు సమాచారం అందింది.
వెంటనే నలుగురు కానిస్టేబుల్స్ తో జగదీష్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కృష్ణ, మధులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో తండ్రి కృష్ణ డ్రాగెన్ తీసుకుని జగదీష్, ఆయన వెంట ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ మూర్తి మీద దాడి చేశాడు.
తరువాత జగదీష్ దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ లాక్కొని అక్కడి నుంచి పరారైనారు. తీవ్రగాయాలై కాలువలో పడిపోయిన జగదీష్ రక్తం ఎక్కువ పోవడంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. సాటి పోలీసులు కానిస్టేబుల్ వెంకటేష్ మూర్తిని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. జగదీష్ కుటుంబ సభ్యులు ఆసుపత్రి చేరుకుని ఆర్తనాదాలు చేశారు. తండ్రిని, కుమారుడిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.