శివసేనకు 170 మంది మద్దతు ఎక్కడిది: నిర్ణయం జరగలేదు: పవార్ వ్యాఖ్యలతో కలకలం..!
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పైన ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. శివసేన నేత ముఖ్యమంత్రి అవుతారని..కాంగ్రెస్..ఎన్సీపీ మద్దతిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఎన్సీపీ అధినేత పవార్ చేసిన వ్యాఖ్యలు శివసేనలో గుబులు రేపుతున్నాయి. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ నుండి వస్తుందో ఆ పార్టీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో సమావేశం తరువాత పవార్ ఈ వ్యాఖ్యలు చేసారు. దీని ద్వారా శివసేనకు మద్దతిచ్చే విషయంలో ఎన్సీపీ..కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నాయా అనే అనుమానం మొదలైంది. ఇక, ఇదే సమయంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు తాము బాధ్యులం కాదని శివసేన నేతలు వివరణ ఇస్తున్నారు.
శరద్ పవార్ పంచ్: కూటమి గురించి సోనియాతో చర్చించలేదు, 170 సీట్లు ఎక్కడివి..?
వారికి 170 మంది మద్దతు ఎక్కడిది..
మహారాష్ట్రలో తమ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని శివసేన చెబుతున్న సమయంలో ఎన్సీపీ అధినేత పవార్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన ఢిల్లీలో సోనియాతో సమావేశమయ్యారు. తాము ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం పైన ఏ ఒక్కరితోనూ చర్చించలేదని స్పష్టం చేసారు. కేవలం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు..అక్కడ సంఖ్యా పరంగా ఉన్న బలా బలాల పైనే చర్చించామని వివరించారు. కూటమ ప్రభుత్వం ఏర్పాటు పైన సోనియాతో చర్చించామని వెల్లడించారు. బీజేపీ ఏం చేస్తుందనేది తాము ఆలోచించటం లేదని..అది వారికి ఉన్న హక్కు అని వ్యాఖ్యానించారు. తమకు ఇంకా ఆరు నెలల సమయం ఉందని చెప్పుకొచ్చారు. శివసేన తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతును ఎక్కడి నుండి కూడగడుతుందో తెలియదంటూ పవార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు శివసేనకు మింగుడు పడటం లేదు.
ఆ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది..
కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో సమావేశం తరువాత పవార్ తమ రెండు పార్టీలే కాదని..తమతో కలిసి పని చేసిన ఇతర పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా..స్వాభిమాని షెట్కారీ సంఘటన్ తమ తోనే ఉంటుందని.. వారి తరపున కూడా ఎమ్మెల్యేలు గెలిచారుని.. వారిని తాము నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేసారు. అదే విధంగా..సమాజ్వాదీ పార్టీకి మేం కొన్ని సీట్లు ఇచ్చామని... వారి ఎమ్మెల్యేలూ గెలిచారనే విషయాన్ని గుర్తు చేసారు. రిపబ్లికన్ గ్రూప్ కూడా తమకు మద్దతుగా ఉందన్నారు. వారందరి విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఎవరితో వెళ్లాలనే విషయాన్ని మాత్రం తాము చర్చించలేదని.. కూటమి ప్రభుత్వం ఏర్పాటుపై సోనియాతో గురించి మాట్లాడలేదని తేల్చి చెప్పారు.
రెండు పార్టీల సీనియర్లు అభిప్రాయాల మేరకే..
ఇదే సమయంలో తమ రెండు పార్టీలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాయన్నారు. రెండు పార్టీలకు చెందిన సీనియర్లు ఎప్పటికప్పడు చర్చించి..సూచనలు చేస్తారని చెప్పుకొచ్చారు. సోనియాతో భేటీలో ఆంటోని కూడా ఉన్నారన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల పైన సమగ్రంగా చర్చించామని.. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలను మేం ఓ కంట కనిపెడుతున్నామని చెప్పారు. నిర్ణయం తీసుకొనే ముందు కాంగ్రెస్..ఎన్సీపీ రెండు పార్టీల సీనియర్ నాయకుల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకుని.. వాటి ఆధారంగానే భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పవర్ తేల్చి చెప్పారు. దీని ద్వారా ఇప్పటికిప్పుడు శివసేనకు మద్దతిచ్చి వారి ప్రభుత్వంలో భాగస్వాములయ్యే అవకాశాలు లేవనే సంకేతాలు ఆయన ఇచ్చినట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
Recommended Video
రాష్ట్రపతి పాలనకు మేము బాధ్యులం కాదు
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు తాము బాధ్యులం కాదని శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ స్పష్టం చేసారు. శరద్ పవార్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో చర్చించిన అంశాలు తనకు తెలియవన్నారు. అదే సమయంలో తాను పవార్ తో కలిసిన సమయంలో రాజకీయాలు చర్చించలేదని.. పంట నష్టం పైనే చర్చించామని వివరించారు. ఇక, ఇదే సమయంలో శివసేన మరోసారి బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్న ట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే, బీజేపీకి మరో ఆరు నెలల సమయం ఉందంటూ పవార్ చేసిన వ్యాఖ్యలు..అదే సమయంలో రాజ్యసభలో ప్రధాని మోదీ ఎన్సీపీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.