విమాన ప్రయాణికులకు శుభవార్త: ఇక డొమెస్టిక్ ఫ్లయిట్లు: రూట్ మ్యాప్ రెడీ?: ఆ యాప్ తప్పనిసరి..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా మూడోదశ లాక్డౌన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైళ్ల రూపంలో ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం నుంచి రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. దేశ రాజధానిని కేంద్రంగా చేసుకుని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 15 ఎక్స్ప్రెస్ రైళ్లను నడిపిస్తోంది సంబంధిత మంత్రిత్వ శాఖ. దీనికోసం ఆన్లైన్ టికెట్ల బుకింగ్ను కూడా ప్రారంభించింది.
Recommended Video

మూడోదశ లాక్డౌన్ ముగిసిన మరుసటిరోజే..
తెరిచిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు బుక్ అయ్యాయంటే జనం ఎంత ఆతృతగా రైలు సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా- విమాన సర్వీసులను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకుని వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడోదశ లాక్డౌన్ ముగిసిన మరుసటి రోజే విమానాల్లో గాల్లోకి ఎగరవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ రూపొందిస్తోంది. మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది.

దేశీయ విమాన సర్వీసులకు అనుమతి లాంఛనమే..
దీనికి సంబంధించిన ఆన్లైన్ టికెట్ల రిజర్వేషన్ను కూడా రేపో, మాపో ప్రారంభిస్తారని సమాచారం. 14 రోజుల మూడోదశ లాక్డౌన్ ఈ నెల 17వ తేదీన ముగియబోతోన్న విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావాలని కేంద్రం భావిస్తోంది. విమాన సర్వీసులతో పోల్చుకుంటే రైళ్లలోనే ప్రయాణికుల రద్దీ ఎన్నో రెట్ల అధికంగా ఉంటుంది. జనం తాకిడి తీవ్రంగా ఉండే రైలు ప్రయాణాలకు సైతం కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో..పరిమితంగా ఉండే విమాన సర్వీసులకు అందుబాటులోకి తీసుకుని రావడం ఇక లాంఛనప్రాయమేనని అంటున్నారు.

తొలిదశలో దేశీయ విమాన సర్వీసులు
ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అందుబాటులోకి తీసుకుని రానుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు కూడా తమ గగనతలాన్ని మూసివేశాయి. అత్యవసరమైనవి, కార్గో మినహా మరెలాంటి కమర్షియల్ విమానాల రాకపోకలను అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో.. మనదేశం కూడా అంతర్జాతీయ విమాన సర్వీసుల జోలికి ఇప్పట్లో వెళ్లే అవకాశాలే లేవు. ప్రారంభంలో దేశీయ విమాన సర్వీసులను మాత్రమే అందుబాటులోకి తీసుకుని రానుంది.

అన్ని ప్రధాన నగరాలను అనుసంధానించేలా..
దేశంలోని అన్ని ప్రధాన నగరాలను అనుసంధానించేలా ఎయిర్ కనెక్టివిటీ ఉంటుందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు. ముంబై, కోల్కత, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణేలకు తొలిదశలో విమానాలను నడిపిస్తామని, రెండోదశలో మిగిలిన నగరాలకు వాటిని విస్తరింపజేస్తామని అంటున్నారు. కేరళలోని తిరువనంతపురం, కోజికోడ్, కోచి విమానాశ్రయాలను కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని తెలుస్తోంది. వందేభారత్ మిషన్ కింద ఈ మూడు ఎయిర్పోర్టులు ప్రస్తుతం కీలకంగా మారినందున.. తొలిదశలో వాటిని అందుబాటులోకి తీసుకుని రాకపోవచ్చని అంటున్నారు.

ఆ యాప్ తప్పనిసరి..
విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. విమానం ఎక్కబోయే ప్రతి ప్రయాణికుడికి చెందిన స్మార్ట్ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ యాప్ను ఇ-పాస్గా భావించాల్సి ఉంటుందని అంటున్నారు. విమానాశ్రయాల్లో దిగిన తరువాత థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవడాన్ని తప్పనిసరి చేశామని, దీనికి సంబంధించిన అధికారిక మార్గదర్శకాలు త్వరలోనే విడుదలవుతాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications