లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..సరికొత్త రికార్డు సృష్టించిన సెన్సెక్స్ నిఫ్టీ
ముంబై: మంగళవారం ట్రేడింగ్ ముగిసేనాటికి మార్కెట్లు పాజిటివ్నోట్తో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీలు కొత్త రికార్డులు సృష్టించాయి. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై అమెరికా దిగుమతి సుంకంను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాక ప్రపంచ మార్కెట్లు ట్రేడింగ్లో దూసుకెళ్లాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 413 పాయింట్ల మేరా లాభపడి 41,352 పాయింట్ల వద్ద ముగియగా... నిఫ్టీ 111 పాయింట్లు లాభపడి 12,165 పాయింట్ల వద్ద ముగిసింది.
అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 70.96 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇక సెన్సెక్స్ ప్యాక్లో టాటా స్టీల్ అత్యధిక లాభాలు పొందింది. 4.38శాతం లాభాలు పెరిగాయి. ఆ తర్వాత ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ 4.37 శాతం, వేదాంత 3.50శాతం, టాటా మోటార్స్ 3.03శాతం, హెచ్డీఎఫ్సీ 2.46శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.39శాతం మేరా లాభాల బాట పడ్డాయి. మరోవైపు సన్ ఫార్మా 1.37శాతం, ఎం&ఎం 0.63శాతం, బజాజ్ ఆటో 0.56శాతం హెచ్యూఎల్ 0.48శాతం మేరా నష్టాలు చవిచూశాయి.
గ్లోబల్ ఈక్విటీస్ లాభాల బాట పట్టడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడినట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అవసరమైతే వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం కానీ లేదా తగ్గించడం కానీ చేస్తామన్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వ్యాఖ్యలు కూడా మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్లో ట్రేడ్ అయ్యేందుకు దోహదపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం జీఎస్టీ సమాఖ్య సమావేశం ఉండగా ట్రేడర్లు కొన్ని ఆశావాహక నిర్ణయాలు వెలువడుతాయని ఆశిస్తున్నారు. అంతేకాదు విదేశీ పెట్టుబడులు కూడా మార్కెట్ మూడ్ను మార్చివేశాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక మొత్తంగా చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.728.13 కోట్లు మేరా ఈక్విటీలు కొనుగోలు చేయడం, దేశీయ ఇన్వెస్టర్లు రూ. 796.38 కోట్లు మేరా ఈక్విటీలను అమ్మినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ వద్ద ఉన్న డేటా ద్వారా తెలుస్తోంది.