బాలిక పట్ల పిజ్జా డెలివరీ బాయ్ అసభ్య ప్రవర్తన
ఢిల్లీ: ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పిజ్జా డెలివరీ బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమిత్ అనే వ్యక్తి డొమినోస్ పిజ్జాలో బాయ్గా పనిచేస్తున్నాడు.
ఆర్డర్పై డెలివరీ నిమిత్తం దక్షిణ ఢిల్లీలోని ఓ ఆపార్ట్మెంట్కు వెళ్లాడు. పిజ్జా డెలివరీ అనంతరం ఆ అపార్ట్మెంట్లోని మూడో అంతస్తు నుంచి కిందికి దిగుతున్నాడు. అక్కడే మెట్లపై ఉన్న బాలికను చూశాడు. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం కారణంగా అప్పటికే అక్కడ చీకటిగా ఉంది.
అక్కడవున్న విద్యుల్ దీపాలను కూడా ఆర్పేసిన నిందితుడు.. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడి చేష్టలకు బాలిక ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టింది. బాలిక అరుపుతో తల్లి బయటకు వచ్చింది. అప్పటికే వ్యక్తి సంఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఏడుపుకు గల కారణాన్ని అడుగగా పాప జరిగిన విషయాన్నంతా చెప్పింది.
దీంతో పాప కుటుంబసభ్యులు తాము ఆర్డర్ ఇచ్చిన డొమినోస్ ఔట్లెట్కు వెళ్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. జరిగిన దానిపై చర్యతీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ మేరకు డోమినోస్ నిర్వాహాకులు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పారు.
కాగా, ఈ విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్లకుండా ఇంతటితో వదిలేయాలని కోరారు. జరిగిన మొత్తం ఘటనను కుటుంబసభ్యులు పోలీసులకు వివరించి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.