వేడుకలు వద్దు, నిధులు.. సాయం చేయండి: మోడీ
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీ తన 64వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ప్రధాని మంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ జరుపుకుంటున్న పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు, బిజెపి శ్రేణులు అత్యంత వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నారు. ఐతే వారి ఆశలపై నీళ్లు చల్లారు ప్రధాని.
తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని స్నేహితులు, శ్రేయాభిలాషులకు సూచించారు. దీనికి బదులు జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు సమయాన్ని, నిధులను కేటాయించి సాయం చేయాలని తన ట్వీట్స్ ద్వారా పిలుపునిచ్చారు. ఈ ట్వీట్స్కు విశేష స్పందన లభించింది.

ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 16, 17వ తారీఖుల్లో తన సొంత రాష్ట్రంలో గుజరాత్లో పర్యటించనున్నారు. ప్రధాని మంత్రి అయిన తర్వాత మోడీ తొలిసారి గుజరాత్ లో పర్యటించనుండటం విశేషం. ప్రతి సంవత్సరం లాగే మోడీ గాంధీ నగర్ లోని తన సోదరుడు పంకజ్ ఇంటికి వెళ్లి తన తల్లి హీరా బా నుంచి ఆశీస్సులు అందుకుంటారు. ఇందుకోసం గాను ప్రధాని ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 16న గుజరాత్ చేరుకుంటారు. అదే రోజు ఇటీవల గుజరాత్లో తొమ్మిది శాసనసభ స్దానాలకు, వడోదర పార్లమెంట్ స్దానానికి జరిగిన బై ఎలక్షన్స్ ఫలితాలు కూడా విడుదలవుతుండటం విశేషం.
ఇక భారత్లో పర్యటన నిమిత్తం వస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్కు ప్రధాని నరేంద్ర మోడీ 17వ తేదీ రాత్రి గుజరాత్లోని సబర్మతి నదీ తీరాన ఓ ప్రైవేటు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకి ఇరు దేశాల నుంచి పరిమిత సంఖ్యలో ఐదుగురు చొప్పున అతిధులు హాజరు కానున్నారు. మహాత్మా గాంధీ నడియాడిన సబర్మతీ ఆశ్రమాన్నీ సందర్శించడానికి చైనా అధ్యక్షుడు రానుండటంతో అక్కడకు సమీపంలోని సబర్మతి తీరానే విందుకు వేదికగా ఎంపిక చేశారు.
జమ్మూ కాశ్మీర్లో వరదల కారణంగా దాదాపు రూ. 6 వేల కోట్ల ఆస్తినష్టం సంభవించినట్లు అసోచామ్ ప్రాథమికంగా అంచనా వేసింది. 13 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో సైనిక బలగాలు, జాతీయ విపత్తు సహాయక దళం ఇప్పటి వరకు రెండు లక్షల మందిని కాపాడగా, మరో లక్ష మంది ఇంకా వరదనీటిలోనే చిక్కుకోని ఉన్నారు.












Click it and Unblock the Notifications