యూనిఫాంలో ఉన్నప్పుడు చప్పట్లు కొట్టి పరువు తీయెద్దు: ఆఫీసర్లకు ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: యూనిఫామ్ వేసుకున్నప్పుడు చప్పట్లు కొట్టి ఆర్మీ పరువు తీయవద్దని ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ హితవు పలికారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ ఆర్మీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కొంత మంది అధికారులు చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు.
దీనిని గమనించిన ఆయన 'నేను ప్రసంగం ముగించిన తర్వాత మీరంతా చప్పట్లు కొట్టొద్దు. ఇకపై మనమంతా యూనిఫాం వేసుకున్నప్పుడు పాటించాల్సిన మర్యాదను పాటించాలి' అని అన్నారు. నిజానికి ఈ విషయాన్ని ప్రసంగించడానికి ముందే చెప్పాలని భావించానని, కాకపోతే మరిచిపోయానని అన్నారు.
అంతే కాదు గత నెలలో జరిగిన కమాండర్స్ కాన్ఫరెన్స్లో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రసంగించిన తర్వాత సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మారుమ్రోగిందని గుర్తు చేశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా యూనిఫాం వేసుకున్నప్పుడు ఈ తరహా చర్యలు చేయవద్దని సూచించారు.
ఇక ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆకాశ్ క్షిపణి భారత సైన్యం అమ్ములపొదిలోకి చేరింది. 96 శాతం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆకాశ్ క్షిపణి... 25 కిలోమీటర్ల పరిధిలో గరిష్ఠంగా 20 కిలోమీటర్ల ఎత్తువరకూ ఎగిరే శత్రుదేశాల హెలికాప్టర్లను, విమానాలను, మానవరహిత విమానాలను ఛేదించగలదు.
డీఆర్డీవో రూపొందించిన ఈ ఆకాశ్ క్షిపణిని మంగళవారం ఢిల్లీలోని మానెక్ షా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైన్యానికి అంకితం చేశారు. భారత సైన్యం ప్రాథమికంగా ఆరు ఫైరింగ్ బ్యాటరీలతో, రెండు ఆకాశ్ క్షిపణి రెజిమెంట్లను అందజేయాల్సిందిగా కోరింది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ.19500 కోట్లు అని రక్షణ శాఖ వర్గాలు ప్రకటించాయి.
ఆర్మీ కోరిన మేరకు మొదటి రెజిమెంటుకు ఈ ఏడాది జూన్-జూలై నాటికి రెండో రెజిమెంటుకు 2016 చివరినాటికి సిద్ధమవుతాయని డీఆర్డీవో వర్గాలు తెలిపాయి. భారత సైన్యంలోకి చేరేందుకు గాను ఆకాశ్ క్షిపణి ప్రాజెక్టు ఇంత ఆలస్యం కావడానికి గల కారణాలను ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ వివరించారు.