పెళ్లి కొడుకు నిర్వాకం: సంఘ బహిష్కరణ
లక్నో: ఉత్తరప్రదేశ్ లో పీటల మీద వరకు వచ్చిన పెళ్లిని నిలిపివేసి అదనపు కట్నం, విలాసవంతమైన కారు కావాలని పట్టుబట్టిన పెళ్లి కుమారుడికి, అతని కుటుంబ సభ్యులకు పంచాయితీ పెద్దలు సరైన బుద్ది చెప్పారు.
వారి నుంచి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు నష్టపరిహారం ఇప్పించడమే కాకుండా పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులను గ్రామంలో సంఘ బహిష్కరణ చేశారు. అయితే పోలీసులు మాత్రం పంచాయితీ ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ జిల్లాలోని సిసాగా గ్రామంలో ప్రకాష్ సింగ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో ప్రకాష్ సింగ్ వివాహం నిశ్చయం అయ్యింది. ఫిబ్రవరి 4వ తేది గురువారం ముహూర్తం నిర్ణయించారు.
ఫిబ్రవరి 2వ తేదిన ప్రకాష్ సింగ్ పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్లాడు. మీరు నాకు అదనంగా రూ. రెండు లక్షలు కట్నం, విలాసవంతమైన ఎస్ యూవీ కారు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని, లేదంటే పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు.
అంత డబ్బు, కారు ఇవ్వలేక పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యలు విలపించారు. విషయం గ్రామపంచాయితీ పెద్ద దేవి (65)కి తెలిసింది. మంగళవారం పెళ్లి కుమార్తె తండ్రిని దేవి పిలిపించారు. పెళ్లి కుమారుడికి ఇచ్చిన బహుమతులతో పాటు పెళ్లికి ఎంత ఖర్చు అయ్యిందని అడిగి తెలుసుకున్నారు.
రూ. ఐదు లక్షల వరకు ఖర్చు అయ్యిందని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పంచాయితీ దృష్టికి తీసుకు వెళ్లారు. పంచాయితీ పెద్దలు పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులను పిలిపించారు. బుధవారం సాయంత్రం లోపు రూ. ఐదు లక్షలు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు.
పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులు అక్షరాల రూ. ఐదు లక్షలు పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెళ్లి పీటలదాక వచ్చి ఆగిపోయిన మీ అమ్మాయి గురించి మీరు బాధపడరాదని, తాము తగిన సంబంధం చూసి దగ్గర ఉండి పెళ్లి చేస్తామని పంచాయితీ వారికి హామి ఇచ్చింది.
గతంలో ప్రకాష్ సింగ్ ఇదే విధంగా పెళ్లి పీటల మీద పెళ్లి నిలిపి వేశాడు. ఇది రెండో సంఘటన. అందు వలన ప్రకాష్ సింగ్ కుటుంబ సభ్యులను సంఘ బహిష్కరణ చేస్తున్నామని గ్రామపంచాయితీ పెద్దలు సంచలనమైన తీర్పు చెప్పారు.