కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు పేలుడు: డీఆర్డీఓ సైంటిస్ట్ జైలులో ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ కోర్టు బాంబు పేలుడు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాంబు పేలుడు కేసులో విచారణను ఎదుర్కొంటోన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) సీనియర్ సైంటిస్ట్ భరత్ భూషణ్ కఠారియా ఆత్మహత్యాయత్నం చేశారు. జైలులో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే జైలు అధికారులు ఆయనను ఎయిమ్స్కు తరలించారు. డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఈ నెల 9వ తేదీన దేశ రాజధానిలోని రోహిణి కోర్టు ఆవరణలో టిఫిన్ బాక్స్ బాంబు పేలిన ఉదంతం తెలిసిందే. కోర్టులో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో భరత్ భూషణ్ కఠారియాను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఆయనను అరెస్ట్ చేశారు. టిఫిన్ బాక్స్లో అమర్చిన బాంబు సర్క్యుట్ను సరిగ్గా అసెంబిల్డ్ చేయకపోవడం వల్లే అనుకున్నంత స్థాయిలో పేలుడు సంభవించలేదని ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక ఇచ్చారు.
విచారణ సందర్భంగా కఠారియా తన నేరాన్ని అంగీకరించారు. తనకు వ్యతిరేకంగా రోహిణీ కోర్టులో పలు పిటీషన్లను దాఖలు చేసిన ప్రత్యర్థిని హతమార్చడానికి టిఫిన్ బాక్స్ బాంబు పెట్టినట్లు కఠారియా అంగీకరించారు. కోర్టు విచారణకు హాజరు కానున్నందున అక్కడే చంపాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా ఆయన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో ఉంటున్నారు. అక్కడే ఆత్మహత్యకు ప్రయత్నించారు.

చేతులను శుభ్రం చేసుకోవడానికి జైలు బాత్రూమ్లో అందుబాటులో ఉంచిన లిక్విడ్ శానిటైజర్ను తాగి, ఆత్మహత్యాయత్నం చేశారు. కొద్దిసేపటి తరువాత వాంతులు చేసుకున్నారు. తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడారు. అపస్మారక స్థితికి వెళ్లారు. జైలు అధికారులు ఆయనను తొలుెత బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. కఠారియాకు ప్రాణాపాయం తప్పిందని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
మరో 24 గంటల్లో ఆయనను డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ పోలీస్ కమిషన్ రాకేష్ అస్థానా తెలిపారు. డిశ్చార్జ్ అయిన వెంటనే తమ విచారణను పునఃప్రారంభిస్తామని అన్నారు. కడుపులో శానిటైజర్ ఆనవాళ్లు లభించాయని, తాను దాన్ని తాగినట్లు కఠారియా డాక్టర్లకు వెల్లడించినట్లు పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఆయన సహకరించట్లేదని, దర్యాప్తును పక్కదారి పట్టించేలా సమాచారం ఇస్తున్నారని అస్థానా చెప్పారు.












Click it and Unblock the Notifications