హోరాహోరీ ఎన్కౌంటర్: కరుడుగట్టిన ఉగ్రవాది లష్కరీ హతం
జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్లో జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి జరిగిన భారీ ఎన్కౌంటర్ ముగిసింది.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్లో జిల్లాలో శనివారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్ ముగిసింది. ఈ ఎన్కౌంటర్లో కరుడు గట్టిన ఉగ్రవాది, లష్కరే తొయిబా కమాండర్ బషీర్ లష్కరీతోపాటు మరో ఉగ్రవాది హతయ్యారు. ఇటీవల ఆరుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉగ్రదాడికి బషీర్ సూత్రధారి కావడం గమనార్హం.
అనంతనాగ్ జిల్లాలోని బాట్పూర గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కుని భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఆ ఇంటిని చుట్టుముట్టిన భద్రతా దళాలు.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ బషీర్ లష్కరిని మట్టుబెట్టాయి. మరో ఉగ్రవాది కూడా హతమయ్యాడు.
కాగా, ఉగ్ర కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. మరో 17మంది పౌరులను భద్రతా దళాలు ఉగ్రవాదుల బారి నుంచి కాపాడాయి. కాగా, గతంలో ఉగ్రవాది బషీర్పై కాశ్మీర్ పోలీసులు 10 లక్షల నజరానా ప్రకటించారు. సోప్సాలి కోకర్నాగ్ ప్రాంతానికి చెందిన బషిర్ లష్కరి 2015 అక్టోబర్ 2న ఆ ఉగ్రవాద సంస్థలో చేరాడు.