కల్లు ఫుల్లుగా తాగండి .. కరోనా దగ్గరకే రాదు ... బీఎస్పీ నేత షాకింగ్ కామెంట్స్
ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ రావడంతో నిదానంగా కరోనా వైరస్ మహమ్మారి నుండి బయటపడతామని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో కొత్తరకం కరోనా వైరస్ మరోమారు ప్రపంచంలోని ప్రజలను టెన్షన్ పెడుతోంది. దీంతో మళ్లీ ప్రతి ఒక్కరి దృష్టి కరోనాపై మరలింది.
తాజాగా కల్లు తాగితే కరోనా తగ్గుతుంది అంటూ బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ విభాగం అధ్యక్షుడు భీమ్ రాజ్ భర్ షాకింగ్ వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశంగా మారింది .

కల్లు గంగా జలం కంటే స్వచ్ఛమైనది , రోగ నిరోధక శక్తి ఉంటుంది అన్న బీఎస్పీ నేత
రాస్రా ప్రాంతంలో బల్లియాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, కరోనావైరస్ సమస్యపై రాజ్భర్ ప్రజలను తప్పుదారి పట్టించారు. కల్లుకు రోగనిరోధక శక్తి బాగా ఉంటుందని , కల్లు గంగా నది నీటి కంటే స్వచ్ఛంగా ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భీమ్ రాజ్ భర్.
ఒక పార్టీ కార్యక్రమంలో ప్రసంగించిన రాజ్భర్, "ప్రజలు ' కల్లును భారీ మొత్తంలో తీసుకుంటే, వారు కోవిడ్ -19 బారిన పడరు అంటూ వ్యాఖ్యానించారు.రాజ్భర్ సమాజంలో, పిల్లల పెంపకంలో వారికి కల్లు తాగిస్తారని అన్నారు .

కల్లు ఫుల్లుగా తాగండి .. కరోనా దగ్గరకే రాదు అన్న రాజ్భర్
కల్లు తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనడానికి సైంటిఫిక్ ఆధారాలు లేవని పేర్కొన్న ఆయన , అయినప్పటికీ కల్లు తాగడం వల్ల కరోనా తగ్గుతుందన్నారు. నిత్యం కల్లు తాగిన వారికి కరోనా రాలేదని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ నుండి కాపాడుకోవడానికి ఇది చేయండి, అది చేయండి అని మార్కెట్లో రకరకాల ప్రచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి . కొందరు ఇమ్యూనిటీ బూస్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ ను తీసుకుంటే కరోనా రాదు అని ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారు .

ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని , ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని విమర్శలు
ఆల్కహాలు తాగడం వల్ల కూడా కరోనా దరిచేరదని కొందరు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు వెల్లుల్లి రసం, వేడినీరు తీసుకోవడం మంచిదని కొందరంటుంటే, కషాయాలు ,నిమ్మరసం, పసుపు కరోనా నుండి కాపాడతాయని మరికొందరు చెబుతున్నారు. ఇక ఇప్పుడు కల్లు తాగితే కరోనా రాదని బీఎస్పీ నేత చెప్పటం గమనార్హం . అయితే ఇది ప్రజలను మభ్యపెట్టటమేనని , దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఈ వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications