డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్; సమీర్ వాంఖడే పై ఎన్సీబీ విజిలెన్స్ విచారణ; 25 కోట్ల లంచం ఆరోపణల ఎఫెక్ట్ !!
ఆర్యన్ ఖాన్ను ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు నుండి తప్పించటానికి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే రూ. 25 కోట్లు లంచం అడిగినట్లు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఆరోపించిన తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) సమీర్ వాంఖడే పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు: సెల్ఫ్ డిఫెన్స్ లో సమీర్ వాంఖడే; తనపై కుట్ర అంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు
సమీర్ వాంఖడేపై వచ్చిన ఆరోపణలపై విచారణ ప్రారంభించామన్న ఎన్సీబీ
ఎన్సిబి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, సమీర్ వాంఖడేపై వచ్చిన లంచం ఆరోపణలపై విచారణ ప్రారంభించామని, ఈ విచారణను తాను పర్యవేక్షిస్తున్నానని వెల్లడించారు. సమీర్ వాంఖడే పదవిలో కొనసాగుతారా అని అడిగిన ప్రశ్నకు, ఈ సమయంలో అది ఏమీ చెప్పలేమని, అలా చెప్పటం తొందరపాటే అవుతుందని ఆయన పేర్కొన్నారు.తాము ఇప్పుడే విచారణ ప్రారంభించామని జ్ఞానేశ్వర్ సింగ్ వెల్లడించారు.
ఎన్సిబి డైరెక్టర్ జనరల్కు వివరణాత్మక నివేదిక అందించిన ముంబై ఎన్సీబీ
ఇక ఈ కేసు విచారణలో భాగంగా కేసులో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ ఆరోపణలపై ఎన్సీబీ ఇప్పటికే వివరణ ఇచ్చింది. ఇది కావాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రతిష్టను దిగజార్చే ఎందుకు చేసిన పనిగా పేర్కొంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, కేంద్ర దర్యాప్తు సంస్థపై వచ్చిన ఆరోపణలపై ముంబై ఎన్సిబి అధికారులు ఎన్సిబి డైరెక్టర్ జనరల్కు వివరణాత్మక నివేదికను సమర్పించారు. మూలాల ప్రకారం, వాంఖడేపై విజిలెన్స్ విచారణ అంతర్గత దర్యాప్తును ఎన్సిబి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా ఉన్న డిడిజి జ్ఞానేశ్వర్ సింగ్కు అప్పగించారని సమాచారం.
ఎన్సీబీ కోర్టులో ఎన్సీబీ కౌంటర్ అఫిడవిట్ , తనపై ఆరోపణలపై వాంఖడే మరో అఫిడవిట్
ఇదే సమయంలో ఈ కేసుపై ఎన్సీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం నాడు కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో షారుక్ ఖాన్ నుండి డబ్బు డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేసిన ప్రభాకర్ సెయిల్ విరోధిగా మారాడని ఎన్సీబీ కోర్టుకు తెలిపారు. ఇక ఇదే సమయంలో తనపై వస్తోన్న ఆరోపణలపై కూడా సంస్థ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మరో అఫిడవిట్ దాఖలు చేశారు. కావాలని ఈ కేసుకు సంబంధించి తనను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు వస్తున్నాయని ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని సమీర్ వాంఖడే కోర్టుకు తెలిపారు.
తనను బెదిరించి దర్యాప్తు ఆటంక పరిచే యత్నం చేస్తున్నారన్న సమీర్ వాంఖడే
ఇదే సమయంలో తన సోదరిని, మరణించిన తన తల్లిని లక్ష్యంగా చేసుకొని కొందరు మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు.తనను బెదిరించి దర్యాప్తును ఆటంకపరిచే ప్రయత్నాలను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని వాంఖడే కోర్టును అభ్యర్థించారు. సమీర్ వాంఖడే మంగళవారం జరిగే సమీక్ష సమావేశం కోసం ఢిల్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రధాన కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా, ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో స్వతంత్ర సాక్షి ప్రభాకర్ సెయిల్ సోమవారం సీనియర్ పోలీసు అధికారులను కలిసేందుకు ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు.
Recommended Video
ఆర్యన్ ఖాన్ ను కేసు నుండి తప్పించటానికి ఎన్సీబీ 25 కోట్ల లంచం డిమాండ్ ఆరోపణలు
ఈ కేసులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను తప్పించేందుకు ఎన్సీబీ అధికారి రూ.25 కోట్లు డిమాండ్ చేశారని ఆదివారం ఆయన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వర్గాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తనకు హాని జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ను తప్పించడానికి రూ. 25 కోట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) అధికారి మరియు పరారీలో ఉన్న సాక్షి కెపి గోసావి సహా ఇతర వ్యక్తులు డిమాండ్ చేశారని వారి సంభాషణ తాను విన్నానని ప్రభాకర్ వెల్లడించారు .