మద్యం సేవించిన ఎయిర్ ఇండియా పైలట్ షార్జాలో అరెస్ట్
షార్జా: పైలట్ల నిర్లక్ష్య దోరణితో ఇటీవల విమాన ప్రమాదాలు పెరుగుతున్నా.. వారు తమ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. ప్రయాణికులను సురక్షితంగా చేర్చాల్సిన బాధ్యతను మర్చిపోయి తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎయిర్ ఇండియా పైలట్ మద్యం సేవించి విమానం నడిపేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది.
మద్యం సేవించిన ఎయిర్ ఇండియా విమాన పైలట్ను గత శనివారం షార్జాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎయిర్ ఇండియా విమానాన్ని కొచ్చి మీదుగా ఢిల్లీ తీసుకురావాల్సిన కమాండర్ ఆర్ నంద మద్యం మత్తులో ఉండగా పోలీసులు పట్టుకున్నారు.
టిఓఐ కథనం ప్రకారం.. ఎయిర్బస్ ఏ-320 విమానం ఏఐ 934 విమానాన్ని నడిపేందుకు వచ్చిన కమాండర్ నంద మద్యం సేవించి ఉన్నాడని గుర్తించిన సెక్యూరిటీ అధికారులు, ఏఐ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
దీంతో మరో పైలట్కు బాధ్యతలు అప్పగించిన ఏఐ, ఆ విమానాన్ని పంపించింది. కాగా, కమాండర్ నందను అదుపులోకి తీసుకున్న అధికారులు, ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.