మందు కొట్టి కారు నడిపిన లేడి లాయర్: ఇద్దరి మృతి
ముంబై: పీకలదాక మద్యం సేవించిన మహిళ న్యాయవాది ఇష్టం వచ్చినట్లు కారు నడపడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ముంబై నగరంలో జరిగింది. మహిళ న్యాయవాది మద్యం సేవించి కారు నడిపినట్లు విచారణలో అంగీకరించింది.
ముంబై నగరంలో జాహ్నవి గడ్కర్ (35) అనే మహిళ న్యాయవాది నివాసం ఉంటున్నది. ఈమె ప్రసిద్ది చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో వైస్ ప్రెసిడెంట్ (లీగల్ అడ్వజర్)గా పని చేస్తున్నది. సోమవారం రాత్రి జాహ్నవి పీకలదాక మద్యం సేవించింది.
తరువాత అడి క్యూ 3 కారులో ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో రెండు బైక్ లను డీకొట్టింది. బైక్ లు నడుపుతున్న వారు ఆమె కారును వెంబడించారు. అదే సమయంలో జాహ్నవి కారును వన్ వే లో నడిపింది. ఆ సందర్బంలో ఎదురుగా వస్తున్న ట్యాక్సీని జాహ్నవి కారు డీకొంది.
ఈ ప్రమాదంలో ట్యాక్సీలో వెళుతున్న మహమ్మద్ సయ్యద్ హుస్సేన్ (57), మహమ్మద్ సలీం సాబూవాల (50) అనే ఇద్దరికి తీవ్రగాయాలైనాయి. అదే ట్యాక్సీలో ఉన్న మరొ ముగ్గురికి గాయాలైనాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మహమ్మద్ సయ్యద్ హుస్సేన్, మహమ్మద్ సలీం సాబూవాల మరణించారని ముంబై నగర డిసీపీ సంగ్రామ్ సింగ్ చెప్పారు. మహిళ న్యాయవాది జాహ్నవిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలలో జాహ్నవి మద్యం సేవించినట్లు వెల్లడిఅయ్యింది.
జాహ్నవి వన్ వేలో కారు నడపడం వలనే ఇద్దరు మరణించారని, మద్యం సేవించి రాష్ గా కారు నడిపిందని తదితర సెక్షన్ ల కింద కేసు నమోదు చేశామని డీసీపీ సంగ్రామ్ సింగ్ చెప్పారు. ఈ ప్రమాదంలో అడి క్యూ 3 కారు, ట్యాక్సీ ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది.