సూట్ వేసుకొస్తున్న దొంగలు: మోడీని ఏకేసిన రాహుల్గాంధీ
న్యూఢిల్లీ/అమేథీ: యూపీఏ ప్రభుత్వం రెండేళ్లు కష్టపడి తీసుకు వచ్చిన భూసేకరణ చట్టాన్ని ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే నీరుగార్చిందని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం విమర్శించారు. భూసేకరణ చట్టంపై లోకసభలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం రైతు వ్యతిరేకిగా మారిందన్నారు. ప్రస్తుత భూసేకరణ చట్టం సంపన్నులకు ప్రయోజనం చేకూర్చేదిగా ఉందన్నారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేకి అన్నారు. గతంలో దొంగలు రాత్రుల్లో దొంగతనం చేసేవారని, ఇప్పుడు సూటు వేసుకొని దర్జాగా వస్తున్నారని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీని ఏకేసిన స్మృతి ఇరానీ
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మంగళవారం నాడు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నియోజకవర్గమైన అమేథీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రాహుల్ పైన నిప్పులు చెరిగారు. అమేథీలోని ఫుడ్ పార్క్ ప్రాజెక్ట్ విషయమై రాహుల్ గాంధీని ఆమె నిలదీశారు. రాహుల్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని ఎద్దేవా చేశారు.
రాహుల్ కార్పోరేట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఫుడ్ పార్క్ కోసం 2010లో భూమిని అలాట్ చేసినప్పటికీ.. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని మండిపడ్డారు. ఫుడ్ పార్క్ కోసం అలాట్ చేసిన భూమిని ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కంపెన్షేషన్ ఇవ్వలేదని విమర్శించారు.
ఫుడ్ పార్క్ అంశంపై లోకసభలో రాహుల్ గాంధీ లేవనెత్తారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీ పైన నిప్పులు చెరిగారు. మోడీ రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. దీనికి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ తన సొంత నియోజకవర్గాన్నే మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
ఆమె అమేథీలో పలువురు రైతులను కలిశారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆమె ఓదార్చారు. అకాల వర్షాల వల్ల ధాన్యం చెడిపోయినప్పటికీ తాము కొంటామని రైతులకు హామీ ఇచ్చారు. ప్రధాన్ మంత్రి సురక్ష సురక్ష భీమా యోజన పేదవారికి ఉపయోగపడే పథకమని చెప్పారు. ఇది మే 26 నుండి ప్రారంభమవుతుందని చెప్పారు.