మోడీ తేల్చేశారు: అప్పటిదాకా ఆ ఊసే వద్దని చెప్పేశారు..
Recommended Video
న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ఊహాగానాలకు ప్రధాని నరేంద్ర మోడీ తెరదించారు. శుక్రవారం బీజేపీ ఎంపీలతో సమావేశమైన ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. ముందస్తు ఎన్నికలు ఉండబోవని తెలిపారు.
2019లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని, వచ్చే జనవరి వరకు ఎన్నికలకు వెళ్లే యోచన లేదని స్పష్టం చేశారు. కాగా, షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే 2018లోనే ఎన్డీయే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చన్న ఊహాగానాలు గత కొంతకాలంగా బాగా ప్రచారంలోకి వచ్చాయి.
ఈ సంవత్సరం ముగిసేవరకు అసలు ఎన్నికల ప్రస్తావనే తీసుకురావద్దని ఎంపీలకు మోడీ స్పష్టంగా చెప్పారు. అలాగే క్షేత్రస్థాయిలో తమ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని, ఎన్డీయే చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని సూచించారు.
అంతేకాదు, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని, ప్రభుత్వం నుంచి వారేం ఆశిస్తున్నారో తెలుసుకోవాలని మోడీ తమకు సూచించినట్టుగా ఓ ఎంపీ వన్ఇండియా.కామ్ తో చెప్పారు. ఎన్నికల గురించి పదేపదే మాట్లాడటం అంత మంచిది కాదని, అది పార్టీకి నష్టం చేసే అవకాశం ఉన్నందునా.. వచ్చే ఏడాది వరకు దాని ప్రస్తావన అక్కర్లేదని మోడీ తేల్చి చెప్పినట్టు సమాచారం.